ఎనిమిదేళ్ళ తర్వాత హిట్టు కొట్టాడు

సహజంగా కొందరు దర్శకులు రెండో సినిమాకి చాలా టైమ్ తీసుకుంటారు. కథ రెడీ గా ఉన్నా హీరోల డేట్స్ , నిర్మాత సెట్ అవ్వకపోవడం ఇలాంటి కారణాల చేత కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అయితే ఒక దర్శకుడు మాత్రం రెండో సినిమాకి ఏకంగా ఎనిమిదేళ్లు తీసుకున్నాడు. అతనే కార్తీక్ వర్మ దండు.

‘విరూపాక్ష’ తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కార్తీక్ దండు మొదటి సినిమా వచ్చి ఎనిమిదేళ్లు దాటింది. నవదీప్ , నవీన్ చంద్ర లతో కార్తీక్ 2015 లో ‘భమ్ బోలేనాథ్’ అనే సినిమా చేశాడు. రేసీ స్క్రీన్ ప్లే తో ఎంటర్టైనింగ్ కేరెక్టర్స్ తో ఆ సినిమా బాగానే తీశాడు కానీ తొలి సినిమా దర్శకుడిగా గుర్తింపు తీసుకోలేదు.

దాంతో రెండు మూడేళ్లు కథలపై వర్క్ చేసి ఫైనల్ గా మూడేళ్ళ క్రితం సుకుమార్ దగ్గర చేరి విరూపాక్ష కథ చెప్పి ఆయన నుండి మంచి మార్కులు అందుకున్నాడు. ఇక మధ్యలో కార్తీక్ ఓ వ్యాధి తో బాధ పడ్డాడు. అది కూడా ఇన్నేళ్ల గ్యాప్ కి ఓ రీజన్. ఏదేమైనా కుర్ర దర్శకుడు బ్లాక్ మేజిక్ కథను మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు చాలా కాలం తర్వాత చూపించి సూపర్ హిట్ కొట్టేశాడు. ఈ జానర్ లో తేజ్ కి ఓ హిట్ ఇచ్చి అతని కం బ్యాక్ కి మంచి ఎనర్జీ ఇచ్చాడు.

ఇకపై ఎక్కువ గ్యాప్ లేకుండా విరూపాక్ష ఇచ్చిన సక్సెస్ తో కార్తీక్ వెంటనే మూడో సినిమా మొదలు పెట్టేసి వచ్చే ఏడాది మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ రైటర్ కం డైరెక్టర్ మూడో సినిమాకు మరో డిఫరెంట్ కథ ఎంచుకొని ఇంకో హిట్టు కొడితే సక్సెస్ ఫుల్ దర్శకుల లిస్టులో చేరిపోయినట్టే.