ఫ్లాష్ బ్యాక్ : 31 వసంతాల ఘరానా విశేషాలు

టాలీవుడ్ కమర్షియల్ సినిమాని మలుపు తిప్పిన ఇండస్ట్రీ హిట్లలో ఘరానా మొగుడుది ప్రత్యేక స్థానం.దీనికి సంబంధించిన కొన్ని అరుదైన విశేషాలు చూద్దాం. 1991లో రజనీకాంత్ విజయశాంతితో పి వాసు దర్శకత్వంలో మన్నన్ షూటింగ్ జరుగుతోంది. చిత్రీకరణ సమయంలో కథలో దమ్ము గుర్తించిన హీరోయిన్ వెంటనే నిర్మాత దేవీవరప్రసాద్ గారితో రీమేక్ హక్కులు కొనిపించారు. పరుచూరి బ్రదర్స్ చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు కీలకమైన మార్పులు చేసి పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసేందుకు పూనుకున్నారు. ఈలోగా మన్నన్ రిలీజై పెద్ద హిట్టు కొట్టింది. అయితే ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న తల్లి సెంటిమెంట్ ని తగ్గించి మాస్ మసాలా కోటింగ్ పెంచారు.

డేట్ల సమస్య వల్ల హీరోయిన్ స్థానంలో కొత్తమ్మాయి నగ్మా వచ్చి చేరింది. మరో కథానాయికగా వాణి విశ్వనాథ్ ని తీసుకున్నారు. అడవిరాముడు నుంచి మాస్ పల్స్ మీద విపరీతమైన పట్టు సాధించిన కె రాఘవేంద్రరావు ఘరానాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. మొదటిసారి కీరవాణికి మెగా ఛాన్స్ దక్కింది. అద్భుతమైన ఆల్బమ్ రెడీ. చిరంజీవిని నగ్మా చెంపదెబ్బ కొట్టే సీన్, ఏందిబే అంటూ పాట పాడటం గురించి ముందే తెలుసుకున్న ఫ్యాన్స్ దేవి ఫిలిమ్స్ ఆఫీస్ ముందు నిరసనలు చేశారు. కానీ సినిమా చూశాక మీకు నచ్చకపోతే తీయిస్తానని చిరంజీవి వివరణ ఇచ్చాక తగ్గారు. రిలీజ్ కు ముందే ఆడియో సెన్సేషన్ అయ్యింది.

1992 ఏప్రిల్ 9 విడుదలైన ఘరానా మొగుడు రికార్డుల వేట మొదలుపెట్టింది. మొదటిసారి పది కోట్ల షేర్ సాధించిన సినిమాగా కొత్త మైలురాయి అందుకుంది. హైదరాబాద్ సంధ్య 70 ఎంఎంలో సిల్వర్ జూబ్లీ ఆడింది. 39 కేంద్రాల్లో వంద రోజుల సంబరం జరిగింది. గుంటూరులో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కు నాలుగు లక్షల మంది రావడం అప్పట్లో సంచలనం. అనిల్ కపూర్ అతిథిగా విచ్చేశారు. మలయాళంలో హే హీరో పేరుతో డబ్బింగ్ చేస్తే అక్కడ నాలుగు సెంటర్లలో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం.హక్కులు కేవలం లక్షకు అమ్మితే కోటి రూపాయలు వచ్చాయి. విచిత్రం ఏంటంటే దీని తమిళ అనువాద హక్కులు 45 లక్షలకు అమ్ముడుపోవడం.