జాలి వద్దు.. ప్రేమ కావాలి: సాయిధరమ్ తేజ్

ఏడాదిన్నర కిందట పెద్ద కష్టమే వచ్చి పడింది సాయిధరమ్‌తేజ్‌కు. అతను హైదరాబాద్‌లో బైక్ మీద వెళ్తూ జారి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో కొన్ని వారాల పాటు ఉన్న అతను.. పూర్తిగా కోలుకుని బయటికి రావడానికి చాలా నెలలే పట్టింది. అలా కోలుకుని వచ్చాక చేసిన సినిమా.. ‘విరూపాక్ష’. తేజు ఆసుపత్రిలో ఉండగానే రిలీజైన ‘రిపబ్లిక్’ సినిమా సరిగా ఆడలేదు. తేజు మీద ఉన్న సింపతీ కూడా అప్పుడు పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ‘విరూపాక్ష’ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

ఐతే ఈ నెల 21న రిలీజవుతున్న ఈ చిత్రాన్ని తన మీద జాలితో చూడొద్దు అంటున్నాడు తేజు. ప్రేక్షకుల నుంచి తాను కోరుకునేది జాలి కాదని.. ప్రేమ అని అతనన్నాడు. మంచి సినిమాతో వస్తున్నానని.. ఇది అందరినీ అలరించే థ్రిల్లర్ సినిమా అని.. మంచి సినిమాను ప్రేమతో ఆదరించాలని అతను వ్యాఖ్యానించాడు.

‘విరూపాక్ష’ ఎలా మొదలైంది, సినిమా ఎలా వచ్చింది అతను వివరిస్తూ.. “2019లో సుకుమార్ గారు ఒకసారి ఫోన్ చేసి ఒక కథ ఉంది, నువ్వు వింటే తప్పకుండా చేస్తావు అన్నారు. ఆయన అసిస్టెంట్ కార్తీక్ దండు వచ్చి నాకు కథ చెప్పాడు. అది వినగానే బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం కలిగి ఈ సినిమా చేశా. త్వరలోనే నా నమ్మకం నిజం అవుతుంది. మంచి థ్రిల్లర్ సినిమా ఇది. గొప్పగా ఉంటుంది. కథ వింటున్నపుడు ఏమనిపించిందో డబ్బింగ్ చెబుతూ సినిమా చూస్తే అదే ఫీలింగ్ కలిగింది. అంత పర్ఫెక్ట్‌గా సినిమా తీశాడు కార్తీక్. ఏప్రిల్ 21న సినిమా వస్తోంది. దయచేసి అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. నేను ఎవరి నుంచీ జాలిని కోరుకోవట్లేదు. ప్రేమను ఆశిస్తున్నా. మీ అంచనాలను మించి సినిమా ఉంటుంది” అని తేజు అన్నాడు. ‘విరూపాక్ష’లో తేజు సరసన మలయాళ హీరోయిన్ సంయుక్త నటించింది.