నాగ్ కొత్త సినిమా అఫీషియల్

టాలీవుడ్లో ఫలితాలతో సంబంధం లేకుండా.. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లు అప్‌డేట్ అవుతూ.. యువ దర్శకులతో సినిమాలు చేసే హీరోల్లో అక్కినేని నాగార్జున ముందుంటాడు. గత ఏడాది ఒక సినిమా అనుభవమున్న రాహుల్ రవీంద్రన్‌తో పని చేసిన నాగ్.. దీని తర్వాత సాల్మన్ అనే కొత్త దర్శకుడితో ‘వైల్డ్ డాగ్’ అనే చిత్రాన్ని లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ లేకుంటే ఈ పాటికి ఈ సినిమా రిలీజ‌య్యేదేమో కూడా. ఐతే వైల్డ్ డాగ్ పని పూర్తి కాక ముందే నాగ్ త‌న కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు కొన్ని రోజుల కిందట వార్తలొచ్చాయి. ‘గ‌రుడ‌వేగ’ ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్నాడన్నదే ఆ వార్త. ఈ వార్త ఇప్పుడు అధికారికం అయింది. ఈ ప్రాజెక్టు గురించి నిర్మాతలు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. బాలీవుడ్ స్టార్ పీఆర్వో కమ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సైతం ఈ ప్రాజెక్టు గురించి ట్వీట్ చేశాడు.

నాగ్-ప్రవీణ్ కలయికలో రాబోతున్న ఈ చిత్రాన్ని ఏషియ‌న్ సినిమాస్ సునీల్ నారంగ్, నార్త్ స్టార్ ఎంట‌ర్టైన్మెంట్ అధినేత శ‌ర‌త్ మ‌రార్ క‌లిసి ప్రొడ్యూస్ చేయనున్నారు‌. డిస్ట్రిబ్యూషన్, థియేటర్ బిజినెస్‌లో చాలా పెద్ద స్థాయిలో ఉన్న సునీల్ నారంగ్.. నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌తో శేఖర్ కమ్ముల తీస్తున్న ‘ల‌వ్ స్టోరీ’ సినిమా ద్వారా నిర్మాతగా పరిచయం కాబోతుండటం విశేషం. ఆ చిత్రం పూర్తి కాకముందే రెండు సినిమాలకు రంగం సిద్ధం చేశాడు. అందులో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనౌన్స్ చేసిన సినిమా ఒకటి. దాని తర్వాతది నాగ్ చిత్రమే. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒకటికి మూడు సినిమాలు తీసిన శరత్.. తర్వాత చిన్నా చితకా చిత్రాలకు పరిమితం అయ్యాడు. నాగ్ సినిమాతో మళ్లీ పెద్ద రేంజ్ సినిమాల్లోకి వస్తున్నాడు. ‘గరుడవేగ’ తర్వాత అనుకున్న ఏ ప్రాజెక్టూ మొదలుకాక కొన్నేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసుకున్న ప్రవీణ్.. ఎట్టకేలకు నాగార్జునతో మంచి సినిమానే సెట్ చేసుకున్నాడు. ‘గ‌రుడ‌వేగ’ స్ట‌యిల్లోనే ఒక కొత్త త‌ర‌హా థ్రిల్ల‌ర్ క‌థ చెప్పి నాగ్‌ను మెప్పించాడ‌ట ప్ర‌వీణ్.