అధికారికంగా ఎన్టీఆర్ 30 హీరోయిన్

నెలల తరబడి షూటింగ్ మొదలుకావడంలో ఆలస్యం జరుగుతూ వచ్చిన ఎన్టీఆర్ 30 తాలూకు కీలకమైన అప్ డేట్ ని అఫీషియల్ గా ఇచ్చారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంచుకున్న సంగతి కొన్ని వారాల క్రితమే లీకైనప్పటికీ ఫైనల్ గా దానికి అధికారిక ముద్ర పడిపోయింది. ఆ మధ్యే హైదరాబాద్ లో తన మీద ఫోటో షూట్ చేసింది ఇందుకోసమే. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో సన్నని చీరకట్టులో బ్యాక్ కెమెరా యాంగిల్ తో జాన్వీ కొంటెగా వెనక్కు చూస్తున్న ఎక్స్ ప్రెషన్ తో లుక్ ని రిలీజ్ చేశారు. మొత్తానికి ఓ ఫ్యాన్స్ లో ఉన్న ఒక ముఖ్యమైన టెన్షన్ ని తగ్గించారు.

నిజానికి ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి చివరి వారంలోనే జరగాల్సింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తారకరత్న అనూహ్య మరణంతో దాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు ఆస్కార్ 95 వేడుక ఈ మార్చి 12న జరగబోతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ యుఎస్ కి బయలుదేరి వెళ్ళిపోయాడు. తిరిగి రావడానికి ఇంకో పది రోజులు పడుతుంది. ఈలోగా దర్శకుడు కొరటాల శివ బృందం మిగిలిన పనులు పూర్తి చేయనుంది. పోర్టు, సముద్రం, మత్స్యకారులు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీలో తారక్ నాయకుడిగా కనిపించనున్నాడు.

మొత్తానికి జాన్వీ కపూర్ కి పవర్ ఫుల్ టాలీవుడ్ డెబ్యూ దొరికింది. ఏళ్ళ తరబడి తన ఎంట్రీని ఎవరితో చేయించాలని ఎదురు చూసిన తండ్రి బోనీ కపూర్ సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకున్నారు. అసలే తెలుగులో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉంది. అందరూ శ్రీలీలనే డిమాండ్ చేయడంతో నిర్మాతలకు ఆమె డేట్లు దొరకడం లేదు. మరోవైపు పూజా హెగ్డే, రష్మిక మందన్నలు అందరికీ అందుబాటులో లేరు. ఇలాంటి పరిస్థితిలో జాన్వీకి సరైన హిట్లు పడితే ఇక్కడే సెటిలైపోవచ్చు. అనిరుద్ రవిచందర్ సంగీతం మీద ఇప్పటికే అభిమానులకు విపరీతమైన అంచనాలున్నాయి.