నాటు నాటుకి గోల్డెన్ గ్లోబ్ – తెలుగువాడి గెలుపు

ఎట్టకేలకు ఎదురు చూసిన అద్భుత క్షణం వచ్చేసింది. సినీ అభిమానులు మనసారా కోరుకున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ సాంగ్ – మోషన్ పిక్చర్ విభాగం కింద ఎంఎం కీరవాణి సగర్వంగా పురస్కారాన్ని అందుకున్నారు.

అశేష ఆహుతుల మధ్య రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ఈ ముగ్గురి కుటుంబ సభ్యుల ప్రత్యక్ష హాజరులో సగర్వంగా తీసుకున్నారు. ఇది ముందే ఊహించినప్పటికీ ఒక్కోసారి ఇలాంటి వేదికల్లో చివరి నిమిషం ట్విస్టులు ఉంటాయి. ఆ భయాలేవీ లేకుండా నాటు నాటు గొప్ప పాటగా నిలిచిపోయింది.

చంద్రబోస్ సాహిత్యం అందించిన నాటునాటుకి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అందించిన నృత్య దర్శకత్వం తారక్ చరణ్ లు పోటీ పడుతూ చేసిన నృత్యం ఆ పాట స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి. ముప్పై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న కీరవాణి ఇప్పటి జనరేషన్ తోనూ పోటీపడగల సత్తా తనలో ఉందని మరోసారి చాటి చెప్పారు.

సోషల్ మీడియా మొత్తం ఈ వీడియో తాలూకు అభినందనలతో హోరెత్తిపోతోంది. ఇంత పెద్ద అంతర్జాతీయ వేదిక మీద ఇలాంటి గౌరవం దక్కించుకోవడం కీరవాణికే ఒక తెలుగు సంగీత దర్శకుడికే ఇది మొదటిసారని చెప్పొచ్చు

అవతార్ సృష్టికర్త జేమ్స్ క్యామరూన్ లాంటి దిగ్గజాలు విచ్చేసిన ఈవెంట్ ఇది. ఆస్కార్ ని టార్గెట్ చేసిన రాజమౌళి దాన్ని కూడా నెరవేర్చుకునే పట్టుదలతో దేశదేశాలు తిరుగుతూనే ఉన్నారు, జపాన్ తో మొదలుపెట్టి ఇప్పటి లాస్ ఏంగిల్స్ దాకా తన హీరోలను వెంటబెట్టుకుని తిరుగుతున్న తీరు అందరికీ స్ఫూర్తి లాంటిది.

ఒకవేళ నాటునాటు కనక ఆస్కార్ గెలుచుకుంటే స్టేజి మీద లైవ్ పెర్ఫార్మన్స్ ఇప్పిస్తానని జక్కన్న ఫారిన్ రిపోర్టర్ కు చెప్పడం దానికి చరణ్ మద్దతు పలకడం విశేషం. సో మార్చిలో తెలుగువాడు గర్వంగా ఉప్పొంగిపోయే క్షణం వస్తుందా చూద్దాం