కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. హ‌ర్ట‌య్యాడు

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా బాగానే నిల‌దొక్కుకున్నాడు యువ క‌థానాయ‌కుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. అతడి తొలి సినిమా ‘రాజా వారు రాణి వారు’ థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో మంచి స్పందన తెచ్చుకుని అతడికి పేరు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత తనే రచయితగా మారి, మేకింగ్ విషయంలోనూ అన్నీ తానై వ్యవహరిస్తూ చేసిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ యువత దృష్టిని బాగానే ఆకర్షించింది. సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోయినా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుని కిరణ్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ను చాటిచెప్పింది. దీంతో వ‌రుస‌బెట్టి సినిమాలు చేస్తూ వ‌చ్చాడ‌త‌ను. కానీ అత‌డి త‌ర్వాతి చిత్రాల్లో స‌మ్మ‌త‌మే ఒక్క‌టే ఓ మోస్త‌రుగా ఆడింది. సెబాస్టియ‌న్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలు బోల్తా కొట్టాయి. అయితే అత‌డి జోరేమీ త‌గ్గ‌లేదు. ఇంకో మూణ్నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు.

అందులో ఒక‌టైన విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ కాబోతోంది. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మించిన చిత్ర‌మిది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్న కిర‌ణ్‌కు ఒక నెటిజ‌న్ పెట్టిన మీమ్ పోస్టు హ‌ర్టింగ్‌గా అనిపించింది. వాల్తేరు వీర‌య్య ప్రి రిలీజ్ ఈవెంట్లో ర‌వితేజ‌ను ప‌క్క‌న పెట్టుకుని చిరంజీవి ఒక కామెంట్ చేశాడు. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో వ‌రుస‌గా, గ్యాప్ లేకుండా సినిమాలు తీస్తున్న‌ది తామిద్ద‌ర‌మే అన్నాడు.

ఐతే ఇందులో చిరు త‌ల‌కు కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ర‌వితేజ త‌ల‌కు ఆది సాయికుమార్ ముఖాలు పెట్టి.. ఈ ఇద్ద‌రి మీద కౌంట‌ర్ వేశాడు ఒక నెటిజ‌న్. గ్యాప్ లేకుండా తామిద్ద‌రం సినిమాలు తీసి జ‌నాల మీదికి వ‌దిలేస్తున్న‌ట్లుగా ఈ పోస్టు ఉండ‌డంతో కిర‌ణ్ హ‌ర్ట‌యిన‌ట్లున్నాడు. తాను ఇండస్ట్రీకి వ‌చ్చిన నాలుగేళ్ల‌లో అయిదు సినిమాలు చేశాన‌ని.. ఇవి కాకుండా త‌న పేరు మీద ఏవైనా సినిమాలు రిలీజ‌య్యాయేమో తెలియ‌ద‌ని.. దీనికి జ‌వాబు చెప్పాల‌ని అన్నాడు కిర‌ణ్. ఐతే ఆ నెటిజ‌న్ ఆన్స‌ర్ ఇవ్వ‌కుండా సైలెంట్ అయిపోయాడు. గ‌త ఏడాది కిర‌ణ్ సినిమాలు 3 రిలీజ్ కాగా.. ఈ ఏడాది కూడా అంత‌కంటే త‌క్కువ సినిమాలు వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు.