కేజీఎఫ్ నిర్మాతల 3 వేల కోట్ల ప్లాన్

ఇండియన్ సినిమాల వసూళ్లు వేల కోట్లకు చేరుకున్నా ఇంకా వందల కోట్ల బడ్జెట్ల గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నాం. ఐతే ఇప్పుడో నిర్మాణ సంస్థ ఏకంగా 3 వేల కోట్ల పెట్టుబడుల గురించి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సంచలన ప్రకటన చేసింది ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్.

కన్నడలో చిన్న సినిమాలతో మొదలుపెట్టి ‘కేజీఎఫ్’తో చాలా పెద్ద రేంజికి వెళ్లిపోయింది హోంబలె ఫిలిమ్స్. ఈ సంస్త నుంచే వచ్చిన ‘కాంతార’ అనూహ్యంగా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ‘హోంబలె’ ప్రతిష్టను మరింత పెంచింది. దీని తర్వాత ఈ సంస్త నుంచి రానున్న ‘సలార్’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. మరి కొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టిన సంస్థ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో తమ సంస్థ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రూ.3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హోంబలె ఫిలిమ్స్ అధినేతల్లో ఒకరైన విజయ్ కిరగందూర్ ప్రకటించాడు.

కేవలం కన్నడలో కాకుండా దక్షిణాదిన అన్ని భాషల్లోనూ హోంబలె ఫిలిమ్స్ రాబోయే రోజుల్లో సినిమాలు నిర్మించనుందని విజయ్ తెలిపాడు. భవిష్యత్తులో ఇండియాలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మరింతగా విస్తరిస్తుందని, అభివృద్ధి చెందుతుందని.. అందుకే తాము నిర్మాణాన్ని కూడా విస్తరిస్తున్నామని విజయ్ తెలిపాడు.

“వచ్చే ఐదేళ్లలో రూ.3 వేల కోట్ల పెట్టుబడులు పెడతాం. ప్రతి సంవత్సరం ఐదారు సినిమాలు నిర్మిస్తాం. అందులో ఒకటి ఈవెంట్ ఫిలిం ఉంటుంది. విభిన్న కథలను తెరపైకి తేవాలనుకుంటున్నాం. ప్రధానంగా దక్షిణాది భాషల్లో సినిమాలు నిర్మిస్తాం. కాంతార తరహాలో మన సంస్కృతీ సంప్రదాయాల నేపథ్యంలో అవి ఉండేలా చూసుకుంటాం. కానీ అంతర్జాతీయ ప్రేక్షకులు మెచ్చేలా ఆ సినిమాలు ఉండాలని కోరుకుంటున్నాం. ఇండియన్ ఎకానమీకి కూడా మా వంతుగా తోడ్పాటు అందించాలనుకుంటున్నాం” అని విజయ్ ప్రకటించాడు.