ప్రపంచ సుందరితో వరుణ్ తేజ్?

ఇండియా నుంచి ప్రపంచ సుందరో, విశ్వసుందరో అయిన భామ ఆటోమేటిగ్గా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యా రాయ్ ఈ నేపథ్యం నుంచే వచ్చింది. ఆమె 90వ దశకంలో ప్రపంచ సుందరి అయింది. అదే టైంలో విశ్వ సుందరి అయిన సుస్మితా సేన్ కూడా బాలీవుడ్లో మంచి అవకాశాలే అందుకుంది. ఈ ఇద్దరితోనూ కలిసి సినిమాలు చేసిన ఏకైక తెలుగు హీరోగా అక్కినేని నాగార్జున రికార్డు సృష్టించారు.

‘రక్షకుడు’లో సుస్మిత కథానాయికగా నటిస్తే.. ‘రావోయి చందమామ’లో ఐశ్వర్య స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత మరే తెలుగు హీరో కూడా అందాల కిరీటాలు అందుకున్న హీరోయిన్లతో జట్టు కట్టిన దాఖలాలు కనిపించవు. ఐతే ఇప్పుడు యువ కథానాయకుడు వరుణ్ తేజ్.. ప్రపంచ సుందరితో రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు.. మానుషి చిల్లర్.

2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్న మానుషి.. ఇప్పటికే బాలీవుడ్లో ‘పృథ్వీరాజ్’ లాంటి భారీ చిత్రంలో నటించింది. ఆమె చేతిలో ఇంకా ఏవో హిందీ సినిమాలున్నట్లున్నాయి. కానీ ఆశించిన స్థాయిలో అయితే కెరీర్ ఊపందుకోలేదు. ఇలాంటి టైంలోనే ఆమెకు తెలుగులో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ నటిస్తున్న ఎయిర్ ఫోర్స్ థ్రిల్లర్లో ఆమె అతడికి జోడీగా నటించనుందట. శక్తి ప్రతాప్ సింగ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

ఇంతకుముందు ‘అంతరిక్షం’ అనే స్పేస్ థ్రిల్లర్లో నటించిన వరుణ్.. ఈసారి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతోంది. వరుణ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్లో, మోస్ట్ యాంబీషియస్ ఫిలింగా ఇది తెరకెక్కుతోంది. పాన్ ఇండియా అప్పీల్ కోసం బాలీవుడ్ హీరోయిన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సోనీ సంస్థతో కలిసి రెనైసెన్స్ ఎంటర్టైన్మెంట్ అనే కొత్త ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.