ఆ డైరెక్టర్‌పై మళ్లీ కాపీ ఆరోపణలు

తమిళంలో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు అట్లీ. అతడి తొలి సినిమా ‘రాజా రాణి’తో పాటు.. ఆ తర్వాత విజయ్ హీరోగా తీసిన ‘తెరి’, ‘మెర్శల్’, ‘బిగిల్’ బ్లాక్‌బస్టర్లు అయ్యాయి. కాకపోతే ఈ సినిమాలు వేటిలోనూ కొత్తదనం కనిపించదు.

తెలుగులో వచ్చిన ‘శ్రీమతి వెళ్లొస్తా’ సహా కొన్ని చిత్రాల స్ఫూర్తితో ‘రాజా రాణి’ తీశాడు. ‘తెరి’ ఫార్ములా ‘బాషా’ రోజుల నుంచి చూస్తున్నదే. మెర్శల్, బిగిల్ సినిమాల్లోనూ చాలా పాత సినిమాల ఛాయలు కనిపిస్తాయి. పాత కథలనే అటు ఇటు తిప్పి.. కమర్షియల్ అంశాలు, ఫ్యాన్ మూమెంట్స్ జోడించి హిట్లు డెలివర్ చేస్తాడని అట్లీకి పేరుంది. అతను ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌తో ‘జవాన్’ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ మధ్య దశలో ఉంది. ఐతే సినిమా పూర్తి కాకముందే దీని మీద కాపీ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఫిర్యాదు కూడా వెళ్లిపోయింది. తమిళంలో ‘పేరరసు’ అనే విజయ్ కాంత్ మూవీని నిర్మించిన మాణిక్యం నారాయణన్ అనే సీనియర్ నిర్మాత అట్లీ మీద తమిళ ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశాడు. ‘పేరరసు’ సినిమాను కాపీ కొట్టే అట్లీ ‘జవాన్’ సినిమా తీశాడని ఆయన ఆరోపిస్తున్నాడు.

‘పేరరసు’లో విజయ్ కాంత్ డబుల్ రోల్ చేశాడు. అందులో ఒకరు పోలీస్ అయితే, మరో పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుంది. ఈ సినిమా కథను కాపీ కొట్టి ‘జవాన్’ తీస్తున్నాడని.. ఇందులో షారుఖ్ డబుల్ రోలే చేస్తున్నాడని… ఒకరు పోలీస్ అయితే, ఇంకొకరు టెర్రరిస్టు అని అంటున్నాడు మాణిక్యం. పాత కథలను కాపీ కొట్టే అలవాటు అట్లీకి ముందు నుంచి ఉందని.. ‘జవాన్’ సినిమా విషయంలో అతడిపై చర్యలు చేపట్టాలని అతను కోరుతున్నాడు. కానీ సినిమా ఇంకా పూర్తయి, విడుదల కాకముందే కాపీ అనడం కరెక్టేనా అన్నది ప్రశ్న. కానీ అంత కాన్ఫిడెంట్‌గా ఆరోపణలు చేస్తూ, ఫిర్యాదు చేశాడంటే ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేం కూడా. మరి ఈ ఆరోపణలపై అట్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి.