ANR చివరి సినిమా పట్టించుకోరా

తెలుగు సినిమా లెజెండ్స్ లో మొదటి పేరుగా ఎన్టీఆర్ పేరుని చెప్పుకుంటే ఆ వెంటనే స్ఫురించే మరో దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. టాలీవుడ్ ప్రస్థానంలో తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసి నిన్నటి నాగార్జున ఇప్పటి చైతు అఖిల్ లకు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి ఇచ్చింది ఆయనే. ఏఎన్ఆర్ చివరి సినిమాగా అందరూ చెప్పుకునేది ఫ్యామిలీ మొత్తం నటించిన మనం గురించే . కానీ ఇప్పుడు రిలీజ్ కౌంట్ పరంగా ప్రతిబింబాలు అనే ఓ పాత చివరి చిత్రం నలభై సంవత్సరాల తర్వాత ల్యాబు నుంచి బయటికి తీసుకొచ్చి విడుదల చేయబోతున్నారు. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రెండు వందల స్క్రీన్లలో ప్రీమియర్ చేస్తారట.

దీని వెనుక పెద్ద కథే ఉంది. 1980 ప్రాంతంలో రాఘవేంద్రరావు తండ్రి ప్రముఖ దర్శకులు కెఎస్ ప్రకాష్ రావు ఈ ప్రతిబింబాలు మొదలు పెట్టారు. అయితే చిత్రీకరణలో ఉండగానే ఏవో కారణాలతో ఈ ప్రాజెక్టు వదిలేశాక ఆ బాధ్యతలు సింగీతం శ్రీనివాసరావు గారు తీసుకుని పూర్తి చేశారు. జయసుధ, తులసి హీరోయిన్లు కాగా ప్రస్తుతం మన మధ్య లేని గుమ్మడి, కాంతారావు లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. ప్రేమాభిషేకం ఇండస్ట్రీ హిట్ దెబ్బకు సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ ని వాడుకుని ఏఎన్ఆర్ తో అప్పట్లో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. దీనికొక్కటే మోక్షం దక్కలేదు.

ఇదంతా బాగానే ఉంది కానీ అక్కినేని చిరస్మరణీయ జ్ఞాపకంగా ఉండబోతున్న ఈ ప్రతిబింబాలను నాగార్జున పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. నిర్మాత ప్రకటనలు పబ్లిసిటీ చేస్తున్నారు కానీ ఫ్యాన్స్ సైతం లైట్ అనుకుంటున్నారు కాబోలు ఏమంత హడావిడి లేదు. ఇలాంటివి థియేటర్ల కన్నా ఏదైనా ఓటిటికి ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంత రీ రిలీజులకు మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నా మరీ ఇంత పాత వాటిని టికెట్లు కొని చూసేందుకు ఇప్పటి ఆడియన్స్ అంతగా సుముఖంగా లేరు. అంత ఘరానా మొగుడునే కొన్నిచోట్ల ఇబ్బంది పడింది. మరి ఈ ప్రతిబింబాలు ఏం చేస్తుందో.