ప్రభాస్.. డబ్బింగ్ చేసుకుంటే బెటరేమో?

ప్రభాస్ బాలీవుడ్డెళ్ళి అక్కడ టాప్ స్టార్ అయిపోయాడు అని ఆనందపడేలోపు, అక్కడకెళ్ళి తీస్తున్న సినిమాలన్నీ ఏదో ఒక రకంగా లోకల్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చెయ్యడం మాత్రం కాస్త బాధపెడుతోంది. సాహో అండ్ రాధేశ్యామ్ సినిమాల్లో బాలీవుడ్ టచ్ ఎక్కువైందని అప్పట్లో కామెంట్లు వినిపిస్తే, ఇప్పుడు ఆదిపురుష్‌ మాత్రం ఏకంగా పూర్తి స్థాయి హిందీ సినిమాలాగానే ఉందంటున్నారు. టీజర్ గ్రాఫిక్స్ పేలవంగా ఉండటంతో, సినిమా మీద ఇప్పుడు సందేహాలు వచ్చేస్తున్నాయ్.

ఈ టైములో ప్రభాస్ ఒక స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తే బాగుంటుందేమో అనేది చాలామంది ఫీలింగ్. అదేంటి, ప్రాజెక్ట్ కె మరియు సలార్ కూడా స్ట్రయిట్ తెలుగు సినిమాలేగా అనొచ్చు. తెలుగు సినిమా అంటే కాస్త తెలుగు ఫీల్ ఉన్న సినిమా అనమాట. ఎందుకంటే సలార్ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇచ్చే కెజిఎఫ్‌ టచ్ కన్నడ వాసన కొడుతుందనేది పెద్ద సందేహం. అంతేకాదు, ప్రాజెక్ట్ కె సినిమా కోసం ఏకంగా దీపికా పదుకొనె, దీశా పటానీ మరియు అమితాబ్ బచ్చన్ ను దించేశారు కాబట్టి, ఆ సినిమా కూడా బాలీవుడ్ ప్రాజెక్ట్ అనే అనుకోవాల్సి వస్తోంది. నిజానికి ప్యాన్ ఇండియాను ఇంప్రెస్ చెయ్యాలని ఇటువంటి బాలీవుడ్ కాంబినేషన్ టచ్చులు ఇస్తుంటే, అనవసరంగా సినిమా క్వాలిటీ పోతోందని ప్రభాస్ అభిమానులు కూడా ఫీలవుతున్నారు. ఇక్కడ క్వాలిటీ అంటే నేటివ్ టచ్ అని మనం అర్ధంచేసుకోవచ్చు.

ఎందుకంటే ప్యాన్ ఇండియా స్థాయిలో ఆడిన బాహుబలి సినిమాలో అక్కడి ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా ఎటువంటి ఎలిమెంట్స్ డిజైన్ చెయ్యలేదు. దాదాపు అందరూ తెలుగులో పాపులర్ అయిన స్టార్లే సినిమాలో కూడా నటించారు. అలాగే కంటెంట్ ఉంటే అసలు క్యాస్టింగ్ తో పనిలేదని కె.జి.ఎఫ్‌ ప్రూవ్ చేసింది. యశ్ నుండి శ్రీనిధి షెట్టి వరకు, అసలు ఈ సినిమలో ఉన్న యాక్టర్లెవ్వరూ బాలీవుడ్డోళ్లకు తెలియనే తెలియదు. కాని సినిమా నచ్చడంతో అక్కడ కోట్లు కొల్లగొట్టేసింది. ఇవన్నీ చూశాక మరి ప్రభాస్ కూడా సింపుల్ గా తెలుగు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసి, వాటిని హిందీలో డబ్ చేస్తే బెటరనే ఫీలింగ్ రాకుండా ఉంటుందా?