డీజే టిల్లు-2.. ఇంతకీ దర్శకుడెవరు?

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన సినిమా.. డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కొత్త దర్శకుడు విమల్ కృష్ణ రూపొందించిన ఈ చిత్రం చిన్న సినిమాలా విడుదలై పెద్ద రేంజికి వెళ్లింది. నిర్మాతలతో పాటు బయ్యర్లకు మూణ్నాలుగు రెట్ల లాభాలు తెచ్చి పెట్టింది. గత కొన్నేళ్లలో టిల్లు తరహాలో జనాలకు ఎక్కిన క్యారెక్టర్ ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు. సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయాక కూడా ఆ క్యారెక్టర్ జనాలను వదిలి పోలేదు.

ఓటీటీలోనూ మోత మోగించిన ‘డీజే టిల్లు’ రీల్స్, షార్ట్స్ ద్వారా కూడా జనాలను ఎంటర్టైన్ చేస్తూ కొన్ని నెలల పాటు ప్రేక్షకులను అలరించింది. ఇంత సక్సెస్ ఫుల్ పాత్రను అలా వదిలేయకుండా.. ఇంకో సినిమా తీయాలని ఎప్పుడో ఫిక్సయ్యాడు హీరో కమ్ రైటర్ సిద్ధు జొన్నలగడ్డ. ఐతే సినిమా స్క్రిప్టు దశలోనే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా దర్శకుడు విమల్ కృష్ణ ఈ ప్రాజెక్టుకు దూరం అయ్యాడు. ఆ తర్వాత సిద్ధునే డైరెక్షన్ కూడా చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.

‘డీజే టిల్లు’ గురించి రకరకాల ఊహాగానాల తర్వాత ఈ సోమవారమే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. సెట్లో డీజే టిల్లు కారును బ్లర్ చేసిన ఫొటోతో షూట్ గురించి హింట్ ఇచ్చారు. ఐతే ‘డీజే టిల్లు’కు దర్శకుడెవరనే విషయాన్ని సస్పెన్స్ లాగా దాచేశారు. ట్విట్టర్లో సినిమా షూట్ గురించి ఇచ్చిన అప్‌డేట్లో దర్శకుడి ప్రస్తావన లేదు. ఐతే ఈ చిత్రాన్ని ‘నరుడా డోనరుడా’, ‘అద్భుతం’ సినిమాల దర్శకుడు మల్లిక్ రామ్ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘విక్కీ డోనర్’కు రీమేక్‌గా వచ్చిన ‘నరుడా డోనరుడా’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నేరుగా ఓటీటీలో రిలీజైన ‘అద్భుతం’ కూడా సరైన స్పందన తెచ్చుకోలేదు. దీంతో మల్లిక్ రామ్‌కు కొత్తగా అవకాశాలేమీ వచ్చినట్లు కనిపించడం లేదు. ‘డీజే టిల్లు’తో మొత్తం క్రెడిట్ అంతా సిద్ధు ఖాతాలోకే చేరింది. దర్శకుడు నామమాత్రం అయిపోయాడు. అందుకేనేమో విమల్ ‘డీజే టిల్లు-2’ నుంచి తప్పుకున్నాడేమో అన్న చర్చ జరిగింది. ఇలాంటి టైంలో ఈ సినిమాకు అవకాశం దక్కించుకున్న మల్లిక్ రామ్.. సిద్ధును దాటి ఈ సినిమాతో ఎంత పేరు సంపాదిస్తాడో చూడాలి.