మీడియాకి సురేష్ బాబు దూరం ?

టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్స్ లో సురేష్ ప్రొడక్షన్ ఒకటి. రామానాయుడు గారి లెగసీని కంటిన్యూ చేస్తూ సురేష్ బాబు ఈ సంస్థను రన్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న సురేష్ బాబు అన్ని విషయాల్లో ముందుంటారు. అల్లు అరవింద్ , సురేష్ బాబు , దిల్ రాజు ఈ ముగ్గురే ఏ విషయం గురించైనా అలవోకగా మాట్లాడుతుంటారు. టాలీవుడ్ లో ఏ టాపికయినా సురేష్ బాబు దగ్గర కచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. అలాంటి సురేష్ బాబు ఈ మధ్య మీడియాకి దూరంగా ఉంటున్నారు.

ఇటివలే టాలీవుడ్లో ఓ సమస్య వచ్చింది. షూటింగ్స్ ఆపేసి మరీ గిల్డ్ నిర్మాతలందరూ ఏకమయ్యారు. అందులో సురేష్ బాబు కూడా ఉన్నారు. కొన్ని మెయిన్ మీటింగ్స్ కి అటెండయ్యారు కూడా. కానీ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. గిల్డ్ తరుపున దిల్ రాజు , సి కళ్యాణ్ , దామోదర ప్రసాద్ ఇలా కొందరు మాత్రమే మీడియా ముందుకొచ్చి మాట్లాడారు.

అయితే సురేష్ బాబు ఇండస్ట్రీ కి సంబంధించిన ఈ విషయంలోనే కాదు తను నిర్మించిన సినిమా, రిలీజ్ చేస్తున్న సినిమా ప్రెస్ మీట్స్ లో ఎక్కడా కనిపించడం లేదు. సురేష్ ప్రొడక్షన్ నుండి వస్తున్న శాకిని డాకిని సినిమా ప్రమోషన్స్ లో కూడా కనిపించడం లేదు. అంతెందుకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న రానా సినిమా ‘విరాటపర్వం’ ప్రమోషన్స్ లో కూడా సురేష్ పాల్గొనలేదు. నారప్ప , దృశ్యం 2 సినిమాల ప్రమోషన్స్ లో యాక్టివ్ గా కనిపించి మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చి అన్ని విషయాల గురించి మాట్లాడిన సురేష్ బాబు ఇప్పుడు ఉన్నపళంగా ఎందుకు సైలెంట్ అయిపోయారు ? ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు ? తెలియాల్సి ఉంది.