1989లో అనుకున్న సినిమా.. 2022లో రిలీజ్

ఇప్పుడు ఇండియా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో ‘పొన్నియన్ సెల్వన్’ ఒకటి. సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం‌కిది డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పొచ్చు. తమిళ గ్రేట్ రైటర్ కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా సినిమా తీయాలని ఆయన కొన్ని దశాబ్దాల కిందట్నుంచి అనుకుంటున్నారు. వేర్వేరు కాలాల్లో వేర్వేరు హీరోలతో ఈ సినిమా చేయడానికి ఆయన ప్రయత్నాలు చేశారు. కానీ రకరకాల కారణాలతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.

ఎట్టకేలకు రెండేళ్ల కిందట లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను మొదలుపెట్టారు. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ప్రకాష్ రాజ్, ప్రభు తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఐతే ఈ సినిమా గురించి 1989లోనే చర్చ జరగడం విశేషం. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఈ సినిమాకు సన్నాహాలు జరిగాయి. స్వయంగా కమలే అప్పట్లో ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

కల్కి కృష్ణమూర్తి ‘కల్కి’ పేరుతో నెలకొల్పిన మ్యాగజైన్‌లోనే ఆయన మరణానంతరం ఈ ప్రాజెక్టుకు సంబంధించి కమల్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో ప్రభు, సత్యరాజ్ ఇందులో కీలక పాత్రలు చేయడానికి ఒప్పుకున్నారని.. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తారని.. పీసీ శ్రీరామ్‌ను ఛాయాగ్రాహకుడిగా, ఇళయరాజాను సంగీత దర్శకుడిగా అనుకుంటున్నామని కమల్ అప్పుడు వెల్లడించారు.

అంతే కాక అప్పుడు ఈ సినిమా బడ్జెట్ రూ.2 కోట్ల దాకా ఉండొచ్చని కూడా కమల్ తెలిపారు. అప్పటికి కోటి రూపాయల బడ్జెట్ అన్నా కూడా చాలా ఎక్కువ. అలాంటిది రూ.2 కోట్ల బడ్జెట్ అంటే సౌత్ ఇండియాలో అప్పటికి ఇది అతి పెద్ద బడ్జెట్ మూవీ అయ్యేదేమో. ‘పొన్నియన్ సెల్వన్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రజినీకాంత్‌తో కలిసి కమల్ ముఖ్య అతిథిగా రాబోతున్న నేపథ్యంలో సంబంధిత ఇంటర్వ్యూ ఇప్పుడు కోలీవుడ్లో చర్చనీయాంశం అయింది. ఈ ఈవెంట్లో కమల్ మరోసారి ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటారని భావిస్తున్నారు. ‘పొన్నియన్ సెల్వన్’ ఈ నెల 30 బహు భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.