మెగా కుర్రాడిది బలుపు కాదు.. వాపే

తొలి సినిమాతో వంద కోట్ల గ్రాస్.. అది కూడా ఒక ప్రేమకథా చిత్రంతో. ఒక కొత్త హీరోకు ఇంతకంటే గొప్ప ఆరంభం ఏముంటుంది? మెగా ఫ్యామిలీ కొత్త హీరో వైష్ణవ్ తేజ్‌కు మాత్రమే ఈ అదృష్టం దక్కింది. ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న టాప్ స్టార్లకు కూడా అరంగేట్రంలో ఇలాంటి ఆరంభం లభించలేదు. తొలి చిత్రంతో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా ఈ రికార్డు సుదీర్ఘ కాలం నిలవడం ఖాయం. ఈ చిత్రంతో నటుడిగా కూడా వైష్ణవ్ మంచి పేరు సంపాదించాడు.

అరంగేట్ర చిత్రంలో అలాంటి బోల్డ్ రోల్ చేసినందుకు ప్రశంసలు అందుకున్నాడు. తొలి సినిమా రిజల్ట్, వైష్ణవ్‌కు వచ్చిన పేరు చూశాక ఇక అతడికి తిరుగులేదనే అనుకున్నారంతా. మెగా ఫ్యామిలీలో మరో పెద్ద హీరో తయారు కాబోతున్నాడని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఏం లాభం? తర్వాతి సినిమాల ఎంపికలో వైష్ణవ్ తప్పటడుగులు వేశాడు. ఫలితంతో తొలి చిత్రంతో వచ్చిన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అంతా కూడా కరిగిపోయింది.

‘ఉప్పెన’ తర్వాత కొంచెం యాక్షన్, మాస్ టచ్ ఉన్న సినిమా చేస్తే వైష్ణవ్ తేజ్‌కు ఇమేజ్ పరంగా ఉపయోగపడేదేమో. కానీ అతను మళ్లీ ఓ ప్రయోగానికే సిద్ధపడ్డాడు. కానీ ఈసారి ఆ ప్రయోగం బెడిసికొట్టింది. ‘కొండపొలం’ కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది. తొలి చిత్రంతో వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న వాడు.. రెండో చిత్రానికి రూ.5 కోట్లకు పడిపోయాడు. ఇప్పుడు మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’ కూడా అంతకుమించి వసూళ్లు రాబట్టేలా కనిపించడం లేదు. ‘కొండపొలం’ అయినా ప్రయోగాత్మక చిత్రం. అది ఆర్ట్ మూవీ తరహాలో ఉంటుంది. అందులో కమర్షియల్ హంగులేమీ లేవు.

ఆ చిత్రానికి వైష్ణవ్ నటన పరంగా ప్రశంసలు అందుకున్నాడు. తన అభిరుచిని కూడా చాటుకున్నాడు. కానీ ‘రంగ రంగ వైభవంగా’ మాత్రం ఏ రకంగానూ అతడికి ఉపయోగపడలేదు. ఈ సినిమాలో అతడి బలహీనతలు చాలా కనిపించాయి. చలాకీ పాత్రలు చేయలేడని, మరీ మూడీగా కనిపిస్తాడని విమర్శలు తెచ్చుకున్నాడు. కథల ఎంపికలో తన అభిరుచి, జడ్జిమెంట్ కూడా ప్రశ్నార్థకం అయింది. ‘ఉప్పెన’తో తెచ్చుకున్నది ఏమైనా మిగిలి ఉంటే ఈ సినిమాతో పోయినట్లే. ఒక రకంగా చెప్పాలంటే వైష్ణవ్‌ది బలుపు కాదు.. వాపు అని రుజువు చేసింది ‘రంగ రంగ వైభవంగా’. ఈ స్థితి నుంచి అతనెలా పుంజుకుంటాడో చూడాలి.