వాళ్ళ సినిమాలు.. టచ్ చేయలేను

తొలి సినిమా ‘ఉప్పెన’తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమాకు ఇలాంటి సబ్జెక్ట్, పాత్ర ఎంచుకోవడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఇక రెండో సినిమాగా ‘కొండపొలం’ లాంటి మరో ప్రయోగాత్మక కథలో నటించాడు. ఇప్పుడతను ‘రంగ రంగ వైభవంగా’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో వైష్ణవ్.. తన మావయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను అనుకరించినట్లుగా ప్రోమోల్లో కనిపించింది.

ఈ పోలికలు చూసి చిరు, పవన్ సినిమాలను వైష్ణవ్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ మెగా అభిమానుల్లో నడిచింది. ఐతే వైష్ణవ్ మాత్రం అలాంటివ ప్రయత్నం ఎప్పుడూ చేయనని తేల్చి చెప్పేశాడు. కానీ ఈ స్టేట్మెంట్‌కు అతను చిన్న రైడర్ పెట్టాడు.. మావయ్యల సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్లు చేసిన చిత్రాలను మళ్లీ టచ్ చేయాలని అస్సలు అనుకోను. నా ఆలోచన అయితే ఇదే. కానీ ఒకవేళ ఎవరైనా వచ్చి  ఇది బాగుంటుంది, నువ్వే చేయాలి అంటే మాత్రం ‘బద్రి’ని రీమేక్ చేస్తే బాగుంటుందనుకుంటున్నా.. అని వైష్ణవ్ చెప్పాడు.

ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి అడిగితే.. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఎన్.శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమా మినహా కొత్తగా ఏదీ అంగీకరించలేదని చెప్పాడు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోందని వైష్ణవ్ తెలిపాడు.

‘కొండపొలం’ తర్వాత తాను చాలా కథలు విన్నానని.. అవేవీ సంతృప్తినివ్వలేదని.. చివరికి గిరీషయ్య చెప్పిన ‘రంగ రంగ వైభవంగా’ కథ నచ్చి సినిమా చేసినట్లు అతను వెల్లడించాడు. ఈ చిత్రంలో ఖుషి, నిన్నే పెళ్ళాడతా’ సినిమాల ఫ్లేవర్ కనిపించినట్లు కొందరు అన్నారని.. కానీ ఆ సినిమాలకు, దీనికి పోలిక ఉండదని.. కేతికకు, తనకు మధ్య వచ్చే సన్నివేశాలే సినిమాకు హైలైట్ అని అతను చెప్పాడు.