దూకుడు పెంచిన కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అనుకున్న‌ది సాధించేలా.. దూకుడు పెంచారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుతో ఢీ అంటే ఢీ అంటూ.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అంతేకాదు.. ఆయ‌న భార‌తీయ రాష్ట్ర‌స‌మితి పేరుతో ఒక జాతీయ పార్టీని ప్రారంభించి.. వ‌చ్చే సార్వ‌త్రిక స‌మ‌రంలో దేశ‌వ్యాప్తంగా పోటీ చేయాల‌నినిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు కొన్నాళ్ల కింద‌ట లీకులు ఇచ్చాయి. అయితే.. వీటిని ప్ర‌తిప‌క్షాలు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

కేసీఆర్‌ను కేవ‌లం ఫామ్ హౌస్ సీఎంగా అభివ‌ర్ణించ‌డంలోనే.. పార్టీలు కాల‌క్షేపం చేస్తున్నాయి. అయితే.. చాప‌కింద నీరులా.. కేసీఆర్ త‌న వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కు దీటుగా రాజ‌కీయ విన్యాసంపై ఆయ‌న దృష్టి పెట్టారు. దీనికి ఆయ‌న తాజాగా.. మూడు రాష్ట్రాల‌ను ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివ‌రిలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్‌.. కొద్ది నెల‌ల గ్యాప్‌తో ఎన్నిక‌లు జ‌ర‌గనున్న క‌ర్ణాట‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌పై కేసీఆర్ న‌జ‌ర్ ప‌డింద‌ని అంటున్నారు.

అయితే.. ఈ ద‌ఫా.. ప్ర‌ధాని మోడీకి చెక్ పెట్టేలా.. ఆయ‌న గుజ‌రాత్ మోడ‌ల్‌ను ఎంచుకుంటే.. సీఎం కేసీఆర్ తెలంగాణ మోడ‌ల్‌ను ఎంచుకున్నార‌ని అంటున్నారు.  ఈ మోడ‌ల్ ఏంటంటే.. రైతుల‌కు సానుకూల నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.. వారితోపాటు.. ద‌ళితులకు అండ‌గా ఉండ‌డం.. స‌మాజంలో అన్ని వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వం సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయడం. ఇదే మంత్రాన్ని ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లోనూ ప్ర‌యోగించేందుకు కేసీఆర్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

ప్రస్తుతానికి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ  ప్రాంతీయ పార్టీ అయినందున.. గుజరాత్, హిమాచల్, క‌ర్ణాటకలో ఇండిపెండెంట్ అభ్యర్థులను బరిలోకి దింపి.. బీజేపీ ఓట్ల‌ను చీల్చ‌డం.. లేదా.. అవకాశం ఉంటే గెలుపు గుర్రం ఎక్క‌డం.. అనే రాజ‌కీయ వ్యూహానికి కేసీఆర్‌ప‌దును పెట్టిన‌ట్టు చెబుతున్నారు. ఇటీవ‌ల ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయ‌కుల‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. అంతేకాదు.. వివిధ ప్రాజెక్టులు.. ప‌థ‌కాల‌పై వారికి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ కూడా ఇచ్చారు.

అనంత‌రం.. వారికి రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను కూడా వివ‌రించారు. ఈ క్ర‌మంలో బీజేపీ పాలిత ఈ మూడు రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌ను కూడా వారి నుంచే అడిగి తెలుసుకున్నారు.  తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా.. ఈ మూడు రాష్ట్రాల్లో తెలంగాణ మోడ‌ల్ పాలిటిక్స్ తీసుకురావాల‌నేది కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.  

తాజాగా వెలువ‌డుతున్న రాజ‌కీయ స‌మాచారం మేర‌కు.. క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌లో.. రైతు నాయ‌కుల‌ను ఎన్నిక‌ల్లో పోటీ పెట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అదేస‌మ‌యంలో సీఎం కేసీఆర్ స్వయంగా అక్కడకు వెళ్లి ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో కొత్త చర్చ లేవనెత్తాలని వ్యూహం సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం.

రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్, మోటార్లకు మీటర్లను వ్యతిరేకించడం, సాగునీటి సౌకర్యం, గ్రామాల్లో కల్లాల నిర్మాణం, రైతు వేదికలు తదితరాల గురించే కాకుండా.. ద‌ళిత బంధు ప్ర‌తిష్టాత్మక ప‌థ‌కాన్నికూడా ఆయా రాష్ట్రాల వ‌ర‌కు విస్త‌రించాల‌ని గులాబీ బాస్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.  ఇది ఖ‌చ్చితంగా బీజేపీకి.. మైన‌స్ అవుతుంద‌ని.. కేంద్రంలో పాగా వేసేందుకు.. ఇది స‌రైన  స‌మ‌య‌మ‌ని.. ఆయ‌న లెక్క‌లు వేసుకుంటున్న‌ట్టు చెబుతున్నారు. మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.