అక్క రక్షణకై ఘోస్ట్ పోరాటం

అక్టోబర్ 5 విడుదల కాబోతున్న నాగార్జున ది ఘోస్ట్ మీద అక్కినేని అభిమానుల అంచనాలు మాములుగా లేవు. గత కొంత కాలంగా కింగ్ ట్రాక్ రికార్డు అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ఇది కోరుకున్న బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇవాళ మహేష్ బాబుతో ట్రైలర్ లాంచ్ చేయించారు. డాక్టర్ రాజశేఖర్ ఫామ్ లో లేని టైంలో ఆయనకు గరుడవేగా రూపంలో మంచి సక్సెస్ ఇచ్చిన ప్రవీణ్ సత్తారు దర్శకుడు కావడం ది ఘోస్ట్ కి ప్లస్ అవుతోంది. వైల్డ్ డాగ్ తర్వాత మరోసారి పూర్తి ఇంగ్లీష్ టైటిల్ తోనే నాగ్ వస్తుండటం విశేషం.

ఇక కంటెంట్ విషయానికి వస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అయినప్పటికీ ఇందులో సెంటిమెంట్ థ్రెడ్ కూడా పెట్టారు. హీరో క్యారెక్టర్ పేరు విక్రమ్. తనకో అక్క ఆమెకో కూతురుందని తండ్రి ద్వారా ఆలస్యంగా తెలుస్తుంది. ఈలోగా వాళ్ళో పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటారు. రక్షించే బాధ్యతను విక్రమ్ తీసుకుంటాడు. అయితే అనుకున్నంత సులువుగా ఇదంతా ఉండదు. దేశ విదేశాలు దాటి తోబుట్టువుని మేనకోడలిని కాపాడుకునే మిషన్ ప్రాణాంతంగా మారుతుంది. ఆ తర్వాత జరిగేదే ది ఘోస్ట్ స్టోరీగా కనిపిస్తోంది.

మొత్తానికి హైప్ పెంచడంలో ఈ ట్రైలర్ ప్లస్ అయ్యేలా ఉంది. అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం కిల్లర్ అనే మూవీలో శారద, బేబీ షాలినిలను ముందు చంపాలనుకుని ఆ తర్వాత వాళ్ళను విలన్ల నుంచి  రక్షించే క్యారెక్టర్ లో నాగ్ మెప్పించారు. దాంతో పోల్చుకుంటే బడ్జెట్ స్కేల్, టెక్నాలజీ బాగా పెరిగిన ది ఘోస్ట్ లో ఆకర్షణలు చాలానే కనిపిస్తున్నాయి. సోనాలి చౌహన్ హీరోయిన్ గా కాగా గుల్ పనాంగ్ తో పాటు అజిత్ విశ్వాసంలో నటించిన అనిఖా సురేంద్రన్ ఇందులో ముఖ్యపాత్ర దక్కించుకుంది. సో ఘోస్ట్ లో యాక్షన్ ప్లస్ ఎమోషన్ రెండూ ఉండబోతున్నాయన్న మాట.