థాంక్ యు కూడా తొందరపడింది

ఒకపక్క నిర్మాతలు టాలీవుడ్ సమస్యల గురించి తీవ్ర చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఇప్పటికే రెండు మూడు దఫాలు పూర్తి చేశారు కానీ ఎలాంటి కంక్లూజన్ రాలేదని వినికిడి. ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. వీళ్ళు డిస్కస్ చేస్తున్న ఇష్యూస్ లో ఓటిటి రిలీజుల వ్యవహారం కూడా ఉంది. పేరున్న స్టార్లు, పెద్ద సినిమాలు తక్కువ గ్యాప్ లో డిజిటల్ లో రావడం వల్ల ఎలాగూ స్మార్ట్ స్క్రీన్స్ లో చూస్తామనుకున్న ఆడియన్స్ థియేటర్లకు రావడం బాగా తగ్గించారన్న అభిప్రాయం అధిక శాతం నిర్మాతల్లో బలంగా ఉంది.

మరోవైపు యథావిధిగా ఓటిటి ప్రీమియర్లు జరిగిపోతున్నాయి. తాజాగా నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన థాంక్ యు ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. అంటే కేవలం మూడు వారాల వ్యవధిలోనే వచ్చేసినట్టు. ఈ సినిమా రిలీజైన ఫస్ట్ వీక్ లోనే వీలైనంత త్వరగా ఓటిటికి ఇస్తారని, నష్టం తగ్గేలా దాని గురించే నిర్మాత దిల్ రాజు సదరు ప్రైమ్ తో చర్చల్లో ఉన్నారనే టాక్ వచ్చింది, ఇప్పుడది నిజమయ్యింది. అయినా 20 కోట్ల దాకా నష్టం తెచ్చిన ఎపిక్ డిజాస్టర్ కు ఈ నిడివే ఎక్కువనే కామెంట్లు లేకపోలేదు.

ఇదే కాదు పక్కా కమర్షియల్ 35 రోజులు, ది వారియర్ 27 రోజులకు వస్తున్న విషయం విదితమే. ఆచార్య బాటలో థాంక్ యు వెళ్లడం ఫ్యాన్స్ నే కాదు మూవీ లవర్స్ ని సైతం బాధ పెడుతోంది. సినిమాలు బాగున్నా లేకపోయినా మరీ దారుణంగా డిజాస్టర్లు కావడం, పట్టుమని ఓ ఆరేడు రోజులు కనీస వసూళ్లు తేలేని స్థితికి పడిపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడ చెప్పిన డీల్స్ గతంలో చేసుకున్నవని సమర్ధించుకున్నా రాబోయే రోజుల్లో ఫిలిం ఛాంబర్ ప్రతిపాదిస్తున్నట్టు ప్రాక్టికల్ గా ఎనిమిది వారాల గ్యాప్ సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.