ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌పై త‌మ్మారెడ్డి హాట్ కామెంట్స్

సినిమాల నిర్మాణానికి సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు షూటింగ్స్ ఆపాల‌న్న ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొంద‌రు ఇప్ప‌టికే అశ్వినీద‌త్, బండ్ల గ‌ణేష్ లాంటి కొంద‌రు ప్ర‌ముఖులు ఈ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతూ ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ లైన్లోకి వ‌చ్చారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపు, హీరోల పారితోష‌కాలు, షూటింగ్స్ నిలిపివేత‌.. త‌దిత‌ర అంశాల‌పై ఓ ఇంట‌ర్వ్యూలో త‌మ్మారెడ్డి త‌న అభిప్రాయాలను కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

నిర్మాణ వ్యయం పెరిగిదంటూ నిర్మాతలు షూటింగ్స్ నిలిపేసి చర్చల, సమస్యల పరిష్కారం అంటూ సమావేశమవుతున్నారని.. ఇందుకోసం షెడ్యూల్స్‌ వేసుకున్న సినిమాల చిత్రీకరణలు ఆపాల్సిన అవసరం లేదని త‌మ్మారెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. నిర్మాణ వ్యయాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రొడ్యూస‌ర్ షూటింగ్ ఆపాలా వ‌ద్దా అన్న‌ది అతని ఇష్టమ‌ని.. అందరూ ఆపేయాల‌ని అన‌డం ఎందుక‌ని త‌మ్మారెడ్డి ప్ర‌శ్నించారు.

సినిమా టికెట్‌ రేట్లు పెంచకపోతే నిర్మాతలు నష్టపోతారంటూ స్పెషల్ ఫ్లైట్ల‌లో వెళ్లి మరీ టికెట్‌ ధరలు పెంచమన్న వారే ఇప్పుడు సినిమా వేడుక‌ల్లో స్టేజ్ ఎక్కి ‘మా సినిమా టికెట్‌ సాధారణ రేటుకే లభించును’ అని చెప్పుకోవలసిన దుస్థితి వచ్చిందని… పెంచమనడం ఎందుకు.. తగ్గించాం అని చెప్పుకోవడం ఎందుకు అని త‌మ్మారెడ్డి ప్రశ్నించారు.

టికెట్‌ ధరల భయానికి సినిమా చూసే ఆడియన్స్‌ తగ్గారని.. మంచి సినిమా అని టాక్‌ వస్తేనే థియేటర్‌లో అడుగుపెడుతున్నారని.. అందుకు ఈ మధ్య వచ్చిన ‘విక్రమ్‌’, ‘మేజర్‌’, ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాలే ఉదాహరణ అని త‌మ్మారెడ్డి చెప్పారు.

టికెట్ ధ‌ర‌ల దెబ్బ‌కు ఇప్పుడు సినిమాలకి వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌ పెట్టుకోవాల్సి వచ్చిందంటూ ప‌రోక్షంగా థాంక్యూ సినిమాపై సెటైర్ వేశారు త‌మ్మారెడ్డి. హీరోల పారితోషికం పెంచింది కూడా త‌మ‌లో కొందమంది నిర్మాతలే అని.. హీరో మార్కెట్‌ను బ‌ట్టి రెమ్యునరేషన్‌ ఇవ్వడం రీజనబుల్‌గా ఉంటుందని.. అలా కాకుండా ఇష్టానుసారం పెంచేసి ఇప్పుడు బాధ ప‌డితే లాభం ఏముంద‌ని ఆయ‌న‌న్నారు..