సాయిపల్లవికి మరో పరీక్ష

అంతా తానై నడిపించి రోజుల తరబడి ప్రమోషన్ల కోసం కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగిన సాయిపల్లవికి విరాట పర్వం ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. పెర్ఫార్మన్స్ పరంగా తను ఎంత బెస్ట్ ఇచ్చినప్పటికీ జనం ఇందులో కాన్సెప్ట్ కి కనెక్ట్ కాలేక తిరస్కరించారు.

విమర్శకుల ప్రశంసలు అందుకున్నా దాని ప్రభావం థియేటర్ కలెక్షన్ల మీద పడలేదు. డిజాస్టర్ ముద్రతో సెలవు తీసుకుంది. కేవలం తన ఇమేజ్ ఒక్కటే ఆడియన్స్ ని తీసుకురాలేదని కంటెంట్ ముఖ్యమని తనతో పాటు దర్శనిర్మాతలకు అర్థమైపోయింది.

ఇప్పుడు మరో పరీక్షకు సాయిపల్లవి రెడీ అవుతోంది. తను ప్రధాన పాత్రలో నటించిన గర్గి ఈ నెల 15న విడుదల కానుంది. తమిళ స్టార్ హీరో సూర్య, జ్యోతిక నిర్మాతలు. గౌతమ్ రామచంద్రన్ దర్శకుడు.

చట్ట వ్యవస్థకు సంబంధించిన అతి సున్నితమైన పాయింట్ తో ఇది రూపొందింది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా తీసుకొస్తున్నారు. అన్ని భాషల్లో డబ్బింగ్ తనే స్వయంగా చెప్పుకుంటోంది. సంగీతం గోవింద్ వసంత సమకూరుస్తున్నారు. ఇప్పటిదాకా దీనికి చెప్పుకోదగ్గ బజ్ అంటూ ఎక్కడ కనిపించకపోవడమే సమస్య.

మళ్ళీ ఇప్పుడీ గర్గ్ తాలూకు బాధ్యత కూడా సాయిపల్లవినే మోయాల్సి ఉంటుంది. అసలే కంటెంట్ బేస్డ్ మూవీస్ కి ఓటిటిలో తప్ప థియేటర్లలో ఆదరణ దక్కడం లేదు. అలాంటిది ఇప్పుడీ సోషల్ ఇష్యూ డ్రామాని ప్రేక్షకులు ఏ మేరకు పనిగట్టుకు చూస్తారన్నది అనుమానమే.

పైగా పోటీ కూడా బలంగా ఉంది. ఒకరోజు ముందు రామ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్ వస్తోంది. బిజినెస్ క్రేజీగా ఉంది కాబట్టి ఎక్కువ స్క్రీన్లతో గ్రాండ్ రిలీజ్ ఇవ్వబోతున్నారు. మరి గర్గితో సాయిపల్లవి ఈ పరీక్ష ఎలా పాసవుతుందో చూడాలి