జబర్దస్త్.. ఇంకేం చూస్తారు?

క్లీన్ ఎంటర్టైన్మెంట్‌కు పెట్టింది పేరైన ఈటీవీలో.. ఆ ఇమేజ్‌కు బిన్నంగా డబుల్ మీనింగ్, బూతు డైలాగ్స్‌తో నిండిన ‘జబర్దస్త్’ కామెడీ షో ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దం కిందట్నుంచి ఈ షో కోట్లాది మందిని అలరిస్తోంది. ముందు చిన్నగా మొదలైన ఈ షో.. తర్వాత తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత ఆదరణ పొందిన కార్యక్రమంగా మారింది. జియో తీసుకొచ్చిన ఇంటర్నెట్ విప్లవం తర్వాత ఈ షో రీచ్ ఎక్కడికో వెళ్లిపోయింది. టీవీని మించి యూట్యూబ్‌లో ఈ కార్యక్రమానికి అమితమైన ఆదరణ, ఆదాయం లభించాయి.

ఐతే ఈ మధ్య ఈ షోలో కామెడీ తగ్గుతోందని, బోర్ కొట్టేస్తోందని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ‘జబర్దస్త్’కు ఆకర్షణగా ఉన్న ఒక్కొక్కరు తప్పుకుంటుండడంతో షో కళ తప్పుతోంది. కొన్నేళ్ల కిందటే నాగబాబు జడ్జిగా తప్పుకున్నప్పటికీ.. మనోతో ఆయన స్థానాన్ని బాగానే రీప్లేస్ చేశారు. కానీ ఇటీవలే మంత్రి అవడంతో రోజా షోకు దూరం కావడం జనాలకు వెలితిగా అనిపించింది. జడ్జి మారినా ఓకే కానీ.. షోకు ప్రధాన ఆకర్షణ అయిన ఇద్దరు టీం లీడర్లు దూరం కావడం ప్రతికూలంగా మారింది.

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్.. ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఈ షోను విడిచిపెట్టారు. షోలో వేరే స్కిట్లు చాలానే ఉంటాయి కానీ.. జనాలు ఎక్కువ కనెక్ట్ అయ్యేది వీరి స్కిట్లకే. వీరికున్న ఆకర్షణ, ఆదరణ వేరు. వాళ్లిద్దరూ తప్పుకోవడంతో జబర్దస్త్‌కు ఆల్రెడీ వ్యూయర్ షిప్‌ తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పుడిక స్టార్ యాంకర్ అనసూయ సైతం ఈ షోకు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. అనసూయ ఈ విషయం నేరుగా చెప్పకుండా ఒక నర్మగర్భమైన పోస్టు పెట్టింది ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆ ఎమోషనల్ పోస్టు చూస్తే.. అనసూయను ఇక జబర్దస్త్‌లో చూడలేమని అర్థమవుతోంది. ఈ షోతోనే ఆమె పాపులారిటీ సంపాదించి.. స్టార్ యాంకర్‌గా, నటిగా ఎదిగింది. కేవలం కామెడీ కోసమే కాకుండా అనసూయ గ్లామర్ కోసం ఈ షో చూసేవాళ్లు చాలామందే ఉన్నారు. షోకున్న చివరి ఆకర్షణ కూడా పోయిందంటే ఇక ‘జబర్దస్త్’ చూసేవాళ్లెవరుంటారు మరి?