ఓటీటీ రిలీజ్‌కు టాలీవుడ్లో కొత్త కండిషన్స్?

ఓటీటీల ద్వారా అదనపు ఆదాయం వస్తోందని మురిసిపోతూ వచ్చారు నిర్మాతలు. కానీ ఈ ఆదాయం పైకి కనిపిస్తుంది కాబట్టి సంతోషమే. కానీ ఓటీటీలో చేస్తున్న బయటికి కనిపించని నష్టాన్నే నిర్మాతలు అంచనా వేయలేకపోతున్నారు. దీని వల్ల శాటిలైట్ హక్కుల రేట్లు తగ్గాయి. అలాగే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గిపోతోంది.

కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చినా రెండు వారాలకే ఓటీటీల్లో ప్రత్యక్షం అవుతుండటం.. పెద్ద సినిమాలను కూడా మూడు వారాలకే డిజిటల్ రిలీజ్ చేస్తుండటంతో ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోతోంది. కొన్ని రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది కదా అన్న ఆలోచనతో థియేటర్లకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూడటానికి ప్రేక్షకులు వెనుకంజ వేస్తున్నారు. ఆచార్య, సర్కారు వారి పాట లాంటి పెద్ద సినిమాలు మూడు వారాలకే ఓటీటీల్లో రిలీజైపోవడం తెలిసిందే.

ఐతే దీని తాలూకు ప్రతికూల ప్రభావం గురించి టాలీవుడ్లో పెద్ద చర్చే నడుస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద నిర్మాతలు ఈ విషయంలో చర్చించుకుని ఇండస్ట్రీలో అంతర్గతంగా కొన్ని కండిషన్లు పెట్టాలని డిసైడైనట్లు అల్లు అరవింద్ కుటుంబ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాసు సంకేతాలు ఇచ్చాడు.

గీతా ఆర్ట్స్ సినిమాల వరకు థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఐదు వారాల్లోపు డిజిటల్ రిలీజ్ ఉండకూడదని నియమం పెట్టుకున్నామని.. బాలీవుడ్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోతుండటంతో థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ విడుదలకు 8 వారాల గ్యాప్ ఉండాలని కండిషన్ పెట్టుకున్నారని.. టాలీవుడ్లో కూడా ఇలాంటి కండిషన్లు రాబోతున్నాయని అతను తెలిపాడు.

మరీ మూడు వారాలకే సినిమాలు ఓటీటీల్లో వచ్చేస్తుండటంతో థియేటర్లకు ఏం వెళ్తాంలే అనుకుంటున్నారని.. కాబట్టి ఓటీటీ విండో విషయంలో కఠినంగా ఉండాల్సిందే అని.. నిర్మాతల్లో దీనిపై చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే నియమ నిబంధనలతో ఒక ప్రకటన వస్తుందని వాసు స్పష్టం చేశాడు.