అంటే OTT తప్పంటున్న సుందరం

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న అంటే సుందరానికి మీద ఫ్యామిలీ ఆడియన్స్ గట్టిగానే గురి పెట్టారు. ఎఫ్3 చూసేయడం అయిపోయింది కాబట్టి న్యాచురల్ స్టార్ నాని మేజిక్ కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా టికెట్ రేట్ల పెంపు లాంటి రిస్కులు చేయకపోవడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశాలున్నాయి. అయితే గత రెండు మూడు రోజులుగా ఈ సినిమాని ప్రైమ్ కు ఇచ్చారని, మైత్రి గత రెండు సినిమాలు వచ్చిన తరహాలోనే ఇది కూడా నాలుగో వారంలో స్ట్రీమింగ్ అవుతుందని ఏదేదో ప్రచారం జరిగింది.

ఇదంతా అబద్దమని నాని కొట్టిపారేశాడు. ఇందాక మీడియాతో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అసలు ఆ వార్తలన్నీ తప్పేనని, ఆ ఓటిటి ప్లాట్ ఫార్మ్ కూడా బయట చెబుతున్నది కాదని షాక్ ఇచ్చాడు. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే నిజం ఉండకపోదు. పుష్ప, సర్కారు వారి పాట ఇరవై రోజుల రన్ పూర్తి చేసుకోవడం ఆలస్యం డిజిటల్ లో వచ్చేశాయి. అంటే సుందరానికి కూడా అదే దారి పడుతుందనే ఊహాగానాలు చెలరేగాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాని స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

నిజానికి ఇలాంటి ప్రచారాలు హీరోలకు పెద్ద సమస్యగా మారాయి. ఆ మధ్య అశోక వనంలో అర్జున కళ్యాణం గురించి కూడా ఈ తరహా న్యూస్ వస్తే నమ్మకండి బాబు అంటూ విశ్వక్ సేన్ వీడియో మెసేజ్ వదిలాడు. థియేటర్లకు వెళ్లాలా వద్దా అనే మీమాంసలో ఉండే కొందరు ప్రేక్షకులకు ఈ వార్తలు స్పీడ్ బ్రేకర్స్ లా మారుతున్నాయి. ఎలాగూ త్వరలో వస్తుంది కదాని హాళ్లకు వెళ్లడం లైట్ తీసుకుంటున్నారు. ఇదంతా కాదు కానీ విడుదలకు ముందే స్ట్రీమింగ్ పార్ట్ నర్స్ ని ప్రకటించే ట్రెండ్ కి స్వస్తి పలికితే సరి.