కమల్ వెర్సస్ సూర్య.. అదిరిపోలా


భారత దేశ సినీ చరిత్రలో కమల్ హాసన్‌ది ఒక ప్రత్యేక అధ్యాయం. ఆయన చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు, ప్రయోగాలు దేశంలో ఇంకెవరూ చేయలేదు అనడంలో అతిశయోక్తి లేదు. కేవలం ప్రయోగాలు చేయడమే కాదు.. ఆ ప్రయోగాలతో అద్భుతమైన విజయాలు అందుకోవడం కూడా కమల్‌కే చెల్లింది.ఐదేళ్ల వయసులోనే నటనలోకి అడుగు పెట్టి.. యుక్త వయసు వచ్చాక అద్భుతమైన పాత్రలు, సినిమాలతో నటుడిగా ఎవ్వరూ అందుకోలేని స్థాయిని అందుకున్న కమల్.. నాలుగు దశాబ్దాల పాటు తన అభిమానులను అలరించాడు.

ఐతే గత దశాబ్దంలో మాత్రం ఆయన్నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు. కొన్నేళ్ల నుంచి ఆయనసలు సినిమాలే చేయట్లేదు. ఇలాంటి టైంలో లోకేష్ కనకరాజ్ లాంటి ఎగ్జైటింగ్ ఫిలిం మేకర్‌తో కమల్ జట్టు కట్టడం, వీరి కలయికలో వచ్చిన ‘విక్రమ్’ మంచి టాక్, రివ్యూలు, ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తుండటం లోకనాయకుడి అభిమానులను ఎంతో సంతోషపెడుతోంది. తమిళంలో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా అడుగులు వేస్తుండగా.. తెలుగు, హిందీ భాషల్లోనూ స్పందన బాగానే ఉంది.

‘విక్రమ్’ సినిమాకు సీక్వెల్ తీయాలని ముందే కమల్, లోకేష్ అనుకుని ఉండగా.. ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయ్యేలా కనిపిస్తుండటంతో సీక్వెల్ పక్కా అని ఫిక్సయిపోవచ్చు. ‘విక్రమ్’లో కమల్‌ పాత్రకు దీటుగా విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్‌ల క్యారెక్టర్లు, నటన ఉండడం వల్ల ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి సీక్వెల్లో ఎవరెవరు ఉంటారు.. ఏ పాత్ర ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరం. ఈ విషయంలో ‘విక్రమ్’లోనే హింట్స్ ఇచ్చేశాడు దర్శకుడు.

విజయ్ సేతుపతి ఇందులో డ్రగ్ మాఫియాను నడిపే గ్యాంగ్‌స్టర్ కాగా.. అతడి మీద రోలెక్స్ అనే బడా గ్యాంగ్ స్టర్‌ ఉన్నట్లు ముందు నుంచి హింట్ ఇస్తూ.. చివర్లో అది సూర్యనే అని వెల్లడించారు. ఉన్న ఐదు నిమిషాల్లో సూర్య తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆ పాత్రను పండించాడు. థియేటర్లో సినిమా చూస్తున్న జనాలు సూర్యను, అత్యంత క్రూరంగా ఉన్న తన పాత్రను చూసి వెర్రెత్తిపోయారు.

సేతుపతి పాత్ర చనిపోయింది కాబట్టి ‘విక్రమ్-2’లో అతనుండడని స్పష్టం అయింది. అందులో సూర్యనే మెయిన్ విలన్ కాబోతున్నాడు. కమల్‌ను ఢీకొట్టే పాత్రలో సూర్య ఉంటే.. ఆ క్యారెక్టర్‌లో బలం ఉంటే సినిమాకు దానికి మించిన ఆకర్షణ మరొకటి ఉండదు. కాబట్టి ఇద్దరు మేటి నటులు సై అంటే సై అని ఢీకొంటే సన్నివేశాలు మామూలుగా పేలవు. కాబట్టి ‘విక్రమ్-2’తో ప్రకంపనలు రేగడం ఖాయం. అలాగే ఇందులో కార్తి కూడా ఉంటాడనే సంకేతాలు కనిపించడం కూడా ప్రేక్షకులను విక్రమ్-2 విషయంలో మరింత ఎగ్జైట్ అయ్యేలా చేస్తోంది.