కరణ్ జోహార్ ఈజ్ బ్యాక్

90వ దశకంలో కుచ్ కుచ్ హోతా హై సినిమాతో బాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు కరణ్ జోహార్. ఆ సినిమా అప్పట్లో భారీ విజయాన్నందుకుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకున్నాడు కరణ్. ఆ తర్వాత కభీ ఖుషి కభీ గమ్, కభీ అల్విదా న కెహనా లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడిగా ఎదిగాడు.

ఐతే రెండో సినిమా కూడా పెద్ద హిట్టయి తనకు దర్శకుడిగా స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టడంతో ఆ పేరును వాడుకుంటూ ‘కల్ హోన హో’ చిత్రంతో నిర్మాతగా అరంగేట్రం చేసిన కరణ్.. ఆ తర్వాత తన ధర్మ ప్రొడక్షన్స్‌ను చాలా పెద్ద నిర్మాణ సంస్థగా మార్చాడు. దర్శకత్వం కంటే కూడా నిర్మాణం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. గత రెండు దశాబ్దాల్లో నిర్మాతగా అతడి నుంచి పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. ఒక దశ దాటాక దర్శకత్వాన్ని అతనంత సీరియస్‌గా తీసుకోలేదు.

గత దశాబ్దంన్నర కాలంలో కరణ్ తీసిన ఫుల్ లెంగ్త్ సినిమాలంటే.. మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్ మాత్రమే. ఎనిమిదేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న కరణ్.. ఎట్టకేలకు మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ‘గల్లీ బాయ్’ జంట రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా అతను ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’ అనే సినిమా తీస్తున్నాడు. తన 50వ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా విశేషాలను అతను పంచుకున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదలవుతుందని ప్రకటించాడు.

టైటిల్ చూస్తే.. ఇది కరణ్ మార్కు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకుంటాం. కానీ ఇదొక ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంరట్టైనర్ అని కరణ్ ప్రకటించడం విశేషం. బాలీవుడ్లో ఇప్పుడు కరణ్ మార్కు ఓల్డ్ స్టైల్ ఫ్యామిలీ డ్రామాలు నడిచే పరిస్థితి లేదు. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా కోరుకుంటున్నారు. కరణ్ కూడా మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రేక్షకుల నాడి పట్టడంతో తిరుగులేని వాడిన కరణ్‌కు ఉన్న పేరు ఈ మధ్య నిలబడట్లేదు. చాలామంది బాలీవుడ్ దర్శక నిర్మాతల్లాగే అతను కూడా ఎదురు దెబ్బలు తింటున్నాడు. మరి ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’తో అతను తిరిగి సత్తా చాటుతాడేమో చూడాలి.