టికెట్ల రేట్ల దెబ్బ‌.. పోస్ట‌ర్‌పై ఇలా వేయాల్సొస్తోంది

అసాధార‌ణంగా పెంచేసిన టికెట్ల రేట్ల తాలూకు ప్ర‌తికూల ప్ర‌భావం టాలీవుడ్‌కు ఇప్పుడు బాగానే అర్థ‌మ‌వుతున్న‌ట్లుంది. చిరంజీవి, మ‌హేష్ బాబు లాంటి స్టార్ల సినిమాల‌కు వీకెండ్లోనే థియేట‌ర్లు నిండ‌ని ప‌రిస్థితి క‌నిపించే స‌రికి తీవ్ర‌త ఏంటో అంద‌రికీ తెలిసొచ్చింది. వీకెండ్ త‌ర్వాత ఈ రెండు చిత్రాల థియేట‌ర్లు వెల‌వెల‌బోయాయి.

ఓ వ‌ర్గం ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం మానేశార‌ని స్వ‌యంగా అగ్ర నిర్మాత‌ దిల్ రాజు స్టేట్మెంట్ ఇచ్చాడంటే టికెట్ల రేట్ల తాలూకు దెబ్బ ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. రాజు సినిమా ఎఫ్‌-3కి అద‌న‌పు రేట్ల పెంపు కోరుకుంటే ఈజీగానే అనుమ‌తులు వ‌చ్చేస్తాయి.

అయినా స‌రే.. రాజు అత్యాశ‌కు పోలేదు. సాధార‌ణ రేట్ల‌తోనే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కానీ ఆ రేట్లు కూడా ఎక్కువే అన్న అభిప్రాయాలు జ‌నాల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎఫ్‌-3కి క్రేజ్ ఉంది కాబ‌ట్టి ఓకే కానీ.. ఈ వారం రిలీజ‌వుతున్న శేఖ‌ర్ లాంటి సినిమాల‌కు సింగిల్ స్క్రీన్లలో 175, మ‌ల్టీప్లెక్సుల్లో 295 అన్నా కూడా ఎక్కువ రేటే.

అందుకే సింగిల్ స్క్రీన్ల రేటును రూ.150కి, మ‌ల్టీప్లెక్సుల రేట్ల‌ను 150-200 మ‌ధ్య పెట్టి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రీమియం మ‌ల్టీప్లెక్సుల్లో కూడా దీనికి రూ.295 రేటు లేదు. రేట్లు త‌గ్గించ‌డ‌మే కాక‌.. పోస్ట‌ర్ మీద సాధార‌ణ ధ‌ర‌ల‌తో అని స్టాంప్ వేసి మ‌రీ సినిమాను రిలీజ్ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఇలా టికెట్ల ధ‌ర‌ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సిన ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చిందో టాలీవుడ్ ఆలోచించాలి. ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇస్తోంది క‌దా అని అయిన‌కాడికి రేట్లు పెంచేశారు. దెబ్బ‌కు రెగ్యుల‌ర్ ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు రావ‌డం మానేస్తున్నారు. ఆల్రెడీ కొవిడ్ వ‌ల్ల సినిమాలు చూసే అల‌వాటు త‌గ్గింది.

ఇప్పుడు టికెట్ల రేట్ల దెబ్బ‌కు అది ఇంకా త‌గ్గిపోయింది. ఇలా అల‌వాటు త‌ప్పిన వాళ్లను మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం అంత తేలిక కాదు. ఎఫ్‌-3 లాంటి సినిమాకు సింగిల్ స్క్రీన్లో ఇంట‌ర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీల‌తో క‌లిపితే రేటు రూ.210 దాటుతోంది. మ‌ల్టీప్లెక్సు రేటు రూ.330 మించుతోంది. సింగిల్ స్క్రీన్ రేటు 150, మ‌ల్టీప్లెక్స్ రేటు 200కు అటు ఇటుగా ఉంటే ఫ్యామిలీస్ ఇలాంటి సినిమాల‌ను పెద్ద ఎత్తున చూసి, ఆక్యుపెన్సీ పెరిగే అవ‌కాశ‌ముంది.