ట్రైల‌ర్ బావుంది కానీ..

ర‌న్ వే 34.. బాలీవుడ్ టాప్ స్టార్ల‌లో ఒక‌డైన అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తూ.. స్వీయ ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణంలో తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఇందులో ఆయ‌న పైల‌ట్ పాత్ర పోషించాడు. స‌హ పైల‌ట్‌గా ర‌కుల్ ప్రీత్, ఇంకో ముఖ్య పాత్ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించారిందులో. సిగ్న‌ల్ క‌ట్ అయి, ఇంధ‌నం అయిపోయి భూమికి 30 వేల‌కు పైగా అడుగుల ఎత్తులో వంద‌ల మంది ప్ర‌యాణికుల‌తో ఉన్న‌ ఓ విమానం దిక్కు తోచ‌ని స్థితికి చేరుకుంటే.. ఆ స్థితిలో ఆ పైలట్ ఎలాంటి సాహ‌సం చేశాడు.. త‌న‌తో పాటు అంద‌రినీ కాపాడి విమానాన్ని భూమి మీదికి తీసుకొచ్చాడా లేదా అన్న‌ది ఈ చిత్ర క‌థ‌.

తాజాగా ర‌న్ వే 34 ట్రైల‌ర్ లాంచ్ చేశారు. అది ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా, ఉత్కంఠ‌భ‌రితంగా సాగింది. ప్రేక్ష‌కుల్లో సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. కాక‌పోతే ఇలాంటి క్లాస్ ట‌చ్ ఉన్న సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇప్పుడు ఎలాంటి ఫ‌లితాన్నందుకుంటుందో అన్న సందేహాలున్నాయి. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

బాలీవుడ్ గ‌తంలో ఎన్న‌డూ లేని ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటోందిప్పుడు. క‌రోనా మ‌హ‌మ్మారి కొట్టిన దెబ్బ చాల‌ద‌ని ఇప్పుడు సౌత్ నుంచి వ‌స్తున్న పాన్ ఇండియా సినిమాలు హిందీ చిత్రాల‌ను గ‌ట్టి దెబ్బే తీస్తున్నాయి. గ‌త ఏడాది చివ‌ర్లో పుష్ప‌, ఇప్పుడేమో ఆర్ఆర్ఆర్.. బాలీవుడ్ సినిమాల వ‌సూళ్ల‌కు భారీగానే గండికొట్టాయి. ఇక కేజీఎఫ్‌-2 సునామీకి నార్త్ బాక్సాఫీస్ రెడీ అయింది. దాని దెబ్బ‌కు జెర్సీ సినిమాను వాయిదా వేయాల్సి వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ భ‌యం తొల‌గ‌డం లేదు.

కేజీఎఫ్‌-2 జోరు వారం రోజుల‌కు ప‌రిమితం అవుతుంద‌న్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు నార్త్ ఇండియాలో మెజారిటీ ఫ్యాన్స్ సౌత్ డైరెక్ట‌ర్స్ తీసే భారీ మాస్, యాక్ష‌న్ సినిమాలే కోరుకుంటున్నారు. వాటికే బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. బాలీవుడ్ నుంచి ఎక్కువ‌గా వ‌చ్చే క్లాస్ సినిమాల‌కు స‌రైన ఆద‌ర‌ణ ఉండ‌ట్లేదు. ఈ నేప‌థ్యంలోనే కేజీఎఫ్‌-2 థియేట‌ర్ల‌లో ఉండ‌గా, ఈ నెల 22న రాబోయే జెర్సీతోనూ పోటీ ప‌డుతూ ఇలాంటి క్లాస్ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటోందో చూడాలి.