‘రాధేశ్యామ్’ ముంచింది.. ‘ఆర్ఆర్ఆర్’ తేల్చింది

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో రెండు చిత్రాలు రెండు వారాల వ్యవధిలో రిలీజయ్యాయి. అందులో ముందు ప్రేక్షకులను పలకరించిన సినిమా ‘రాధేశ్యామ్’. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన రెండో చిత్రమిది. ‘సాహో’ నిరాశ పరిచిన నేపథ్యంలో ప్రభాసే కాక అభిమానులంతా దీనిపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ ఐదేళ్లకు పైగా కష్టాన్ని ఈ సినిమా మీద పెడితే.. యువి క్రియేషన్స్ వాళ్లు రాజీ లేకుండా వందల కోట్లు పోసి ఈ సినిమాను నిర్మించారు.

‘సాహో’ చేదు అనుభవం మిగిల్చినప్పటికీ బయ్యర్లు అందరూ ప్రభాస్‌ను నమ్మి ఈ చిత్రంపై భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ వారి నమ్మకం ఫలించలేదు. డివైడ్ టాక్‌తో మొదలైన ‘రాధేశ్యామ్’ వీకెండ్ వరకే సత్తా చాటింది. ఆ తర్వాత చతికిలబడింది. మళ్లీ పుంజుకోనే లేదు. దీంతో బయ్యర్లకు భారీ నష్టాలు తప్పలేదు. నైజాం ఏరియాలో ఈ సినిమాను రిలీజ్ చేసిన దిల్ రాజుకు గట్టి దెబ్బే తగిలింది.

రాజు కెరీర్లోనే అత్యధికంగా రూ.15 కోట్లకు పైగా ఈ చిత్రం నష్టాలు తెచ్చి పెట్టింది. ఓవరాల్‌గా కూడా నష్టాల పరంగా చూస్తే ఇది ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడం గమనార్హం. యువి క్రియేషన్స్ వాళ్లు బయ్యర్లకు ఏదో సెటిల్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అవి ఎంత మేర, ఎప్పుడన్న క్లారిటీ లేదు. ఐతే ‘రాధేశ్యామ్’ నిర్మాతలు ఏమేర ఆదుకున్నారో కానీ.. దిల్ రాజు వరకు ‘ఆర్ఆర్ఆర్’తో బాగానే బయటపడ్డారు.

‘రాధేశ్యామ్’ గాయాలకు ఈ చిత్రం బాగానే మందు రాస్తోంది. తన కెరీర్లోనే ఆయన అత్యధిక లాభాలు అందుకుంటున్నది ఈ చిత్రంతోనే. నైజాం ఏరియాలో ‘ఆర్ఆర్ఆర్’ సంచలనాలు మామూలుగా లేవు. రూ.70 కోట్లకు హక్కులు కొని రిలీజ్ చేసిన దిల్ రాజుకు వారం తిరక్కుండానే డబ్బులు వెనక్కి వచ్చేశాయి. బంపర్ క్రేజ్‌కు తోడు నైజాంలో భారీగా ఉన్న టికెట్ల ధరలు దిల్ రాజు పంట పండించాయి. వీకెండ్ వరకు హౌస్ ఫుల్స్‌తో, ఆ తర్వాత కూడా మంచి ఆక్యుపెన్సీతో సినిమా నడవడంతో దిల్ రాజు చింత తీరిపోయింది. ఆల్రెడీ లాభాల్లోకి వచ్చేసిన ఈ చిత్రం ఫుల్ రన్లో నైజాంలో రూ.100 కోట్ల షేర్ మార్కును దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి రాజు ఏ స్థాయిలో లాభపడ్డారో అర్థం చేసుకోవచ్చు.