రాజమౌళి హింట్.. మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలే

‘బాహుబలి’తో ఒకేసారి చాలా మెట్లు ఎక్కేశాడు రాజమౌళి. ఆ సినిమా ఆయన్ని ఇండియాలో మోస్ట్ వాంటెడ్, నంబర్ వన్ డైరెక్టర్‌గా మార్చింది. ఆయనతో సినిమా చేయడం ఇప్పుడొక కెరీర్ టార్గెట్‌గా మారిపోయింది బడా బడా స్టార్లకు కూడా. ‘బాహుబలి’ తర్వాత జక్కన్నతో జట్టు కట్టే అవకాశం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అందుకున్నారు. ఇంతకు ముందే వీళ్లిద్దరూ విడివిడిగా జక్కన్నతో సినిమాలు చేసినా.. ‘బాహుబలి’ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రాన్ని ఆయనతో చేయడం ప్రత్యేకమే.

ఈ సినిమాతో జక్కన్న స్థాయి ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆ స్థాయిలో జక్కన్నతో సినిమా చేయబోయేది మహేష్ బాబు. వీరి కలయికలో ఎప్పుడో సినిమా రావాల్సి ఉన్నప్పటికీ.. ఎట్టకేలకు, జక్కన్న ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్‌గా ఎదిగిన టైంలో మహేష్ ఆయనతో కలిసి పని చేయబోతుండటం పట్ల అతడితో పాటు అభిమానులూ చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. వీరి కలయికలో రాబోతున్న సినిమా బ్యాక్ డ్రాప్ గురించి ఇప్పటికే ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆఫ్రికా నేపథ్యంలో నడిచే అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను చెబుతున్నారు. ఐతే దీని గురించి రాజమౌళి అయితే ఇప్పటిదాకా ఏమీ మాట్లాడలేదు.

ఒక సినిమా చేస్తుండగా.. ఇంకో సినిమా గురించి మాట్లాడనంటూ సమాధానం దాట వేస్తూ వచ్చాడు. ఐతే తాజాగా ప్రముఖ ఫిలిం క్రిటిక్ భరద్వాజ్ రంగన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న.. మహేష్‌తో చేయబోయే సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఈ చిత్రం బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లను మించి ఉంటుందని.. ఇదొక ఎపిక్ మూవీ అవుతుందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు.

ఇంతకుమించి జక్కన్న ఏమీ మాట్లాడకపోయినా.. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లను మించిన సినిమా అనేసరికి మహేష్ అభిమానుల ఆనందం పట్టరాని విధంగా ఉంది. మహేష్‌తో రాజమౌళి మామూలు సినిమా ఏమీ చేయడని, ఆయన స్థాయిలోనే భారీగా ఉంటుందని.. కాబట్టి జక్కన్న అండతో ఇండియన్ బాక్సాఫీస్‌లో మహేష్ ప్రకంపనలు రేపడం ఖాయమని ఉద్వేగానికి గురవుతున్నారు.