ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు సతీమణి కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా.. బాహుబలిగా.. డార్లింగ్ గా అందరి మనసుల్ని దోచుకునే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూస్తుంటారో.. అంతేలా అతడి పెళ్లి ముచ్చట వినేందుకు తెలుగు ప్రజలంతా తపిస్తుంటారు. సినిమాల గురించి మాట్లాడుకునే మాటల మధ్యలో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన రావటం తరచూ జరుగుతూనే ఉంటుంది. ఈ పెళ్లి ప్రస్తావన వచ్చినంతనే అనుష్క కూడా ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే.

వారిద్దరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ వార్తలు బోలెడన్ని వచ్చినా.. వారిద్దరు మాత్రం ఎప్పుడూ అలాంటిదేమీ లేదని చెప్పటమే కాదు.. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెబుతుంటారు. తాజాగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం వేయి కళ్లు పెట్టుకొని ఎదురుచూస్తున్న వాళ్లెందరో. ఈ మూవీ విడుదల వేళ.. మరోసారి ప్రభాస్ పెళ్లి ప్రస్తావన రావటం.. దానికి ముందు అతడి లవ్ టాపిక్ ను మీడియా ప్రతినిధులు సైతం నేరుగా అడిగేయటం.. సరైన సమాధానం ఇవ్వకుండా  డార్లింగ్ తప్పించుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ప్రభాస్ – అనుష్కల పెళ్లిపై వినిపించే వార్తలపై డార్లింగ్ పెద్దమ్మ.. కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి తాజాగా స్పందించారు. వీరిద్దరి పెళ్లి జరగదని.. ఎందుకంటే వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఆమె తేల్చేశారు. వారి మధ్య పెళ్లి లాంటి ఫీలింగ్స్ లేవన్నారు. ప్రభాస్ కు మన సంస్కృతి సంప్రదాయాలంటే చాలా గౌరవమని.. మహిళలంటే అమితమైన మర్యాదను ఇస్తుంటారని.. అలానే తన కుటుంబానికి.. ఇంటి పెద్దకు గౌరవం ఇస్తారని పేర్కొన్నారు. ప్రభాస్ కచ్ఛితంగా పెళ్లి చేసుకుంటాడని.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు చెప్పిన ఆమె.. మరో ఆసక్తికరమైన మాటను వెల్లడించారు.

అదేమంటే.. ప్రభాస్ చేసుకునే అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించిన వారా అనే ప్రశ్నకు సమాధానంగా ఆ విషయం ఇప్పుడే చెప్పలేనని.. త్వరలోనే తెలుస్తుందన్నారు. అప్పటివరకు నిరీక్షణ తప్పదని స్పష్టం చేశారు. డార్లింగ్ ప్రభాస్ పెళ్లి చేసుకుంటారు.. కానీ ఇప్పుడే కాదన్న మాట నిరాశకు గురి చేయక మానదు. అదే సమయంలో ప్రభాస్ కాబోయే భార్య ఇండస్ట్రీకి చెందిన అమ్మాయా? బయట అమ్మాయా? అన్న విషయంలోనూ శ్యామల దేవి స్పష్టత ఇవ్వకపోగా.. కొత్త సందేహాన్ని తీసుకొచ్చేలా ఆమె మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.