క‌న్న‌డ మూవీకి బాల‌య్య‌-గోపీచంద్ ప్రాజెక్ట్ రీమేక‌ట‌?

చాలా కాలం త‌ర్వాత `అఖండ‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్‌లో ఉన్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న 107వ చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, వై. ర‌వి శంక‌ర్ క‌లిసి నిర్మిస్తున్న‌ ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది.

ఎస్.ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. గ‌త ఏడాదే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్రాండ్‌గా ప్రారంభం కాగా.. నిన్న తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో‌ రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో ఫ‌స్ట్ షెడ్యూల్‌ను ప్రారంభించారు. అయితే అటు షూట్ మొద‌లైందో లేదో.. ఇటు బాల‌య్య లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

ఇంకేముంది.. పెట్టిందెవ‌రో కూడా ప‌ట్టించుకోకుండా అభిమానులు ఎంతో ఉత్సాహంగా బాల‌య్య పిక్‌ను నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా ఇక్క‌డే ఓ అనుమానం మొద‌లైంది. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫొటోలో బాల‌య్య గెటప్ గానీ, ఆ షూట్ సెటప్ కానీ చూస్తుంటే కన్నడలో సూప‌ర్ హిట్ సినిమా `మఫ్టి`నే గుర్తుకు వ‌స్తోంది.

శివరాజ్‌కుమార్‌, శ్రీ మురళి న‌టించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్ర‌మిది. 2017లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. అయితే ఈ సినిమాకు రీమేక్‌గానే బాల‌య్య‌-గోపీచంద్ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతోంద‌నే టాక్‌ ప్ర‌స్తుతం బ‌లంగా వినిస్తోంది. మ‌రి దీనిపై మేక‌ర్స్ స్పందిస్తే గానీ స్ప‌ష్ట‌త వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు.