‘మాస్క్ తీసేదేలే..’ పుష్పను వాడేసిన ప్రభుత్వం!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రీసెంట్ గా ‘పుష్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నటుడిగా బన్నీ రేంజ్ ని పెంచిన సినిమా ఇది. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. అక్కడ కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. ఈ సినిమాలో పాటలు, సన్నివేశాలను రీల్స్ గా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అభిమానులు. 

పలు ఇండియన్ క్రికెటర్స్ కూడా బన్నీను అనుకరిస్తూ.. ‘తగ్గేదేలే’ డైలాగ్ ను రీల్స్ గా చేశారు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు బన్నీ ‘పుష్ప’ పోస్టర్ కి హెల్మెట్ పెట్టి ప్రమోషన్స్ కోసం వాడేశారు. తాజాగా భారత ప్రభుత్వం కూడా ‘పుష్ప’ క్రేజ్ ని వాడేసింది. భారత ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘పుష్ప’ పోస్టర్ ను పోస్ట్ చేశారు. 

బన్నీ ‘తగ్గేదేలే’ స్టిల్ ను పోస్ట్ చేస్తూ.. కరోనా నియంత్రణ ప్రచారంలో వాడేసాహెరు. ‘డెల్టా లేదా ఒమిక్రాన్.. ఏదైనా సరే నేను మాత్రం మాస్క్ తీసేదేలే’ అన్నట్లుగా టైటిల్ జోడించారు. రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కంట్రోల్ చేయాలంటే మాస్క్ తప్పనిసరి. 

కానీ చాలా మంది మాస్క్ లు ధరించడం లేదు. దీంతో  ప్రేక్షకుల్లో అవగాహన పెంచడానికి ‘పుష్ప’ పోస్టర్ ను వాడుకుంటూ కొత్త ప్రమోషన్ మొదలుపెట్టారు. దీన్ని బట్టి ఈ సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో అర్ధమవుతోంది. ఏకంగా ఇండియన్ గవర్నమెంట్ బన్నీ పోస్టర్ ను వాడుకోవడం విశేషమనే చెప్పాలి.