రాజమౌళి సతాయించాడంటే..

‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాట రిలీజైన దగ్గర్నుంచి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో తెలిసిందే. ఇండియన్ సినిమాలోనే బెస్ట్ డ్యాన్సర్ల జాబితాలో టాప్‌లో ఉండే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలిసి ఒక పాటలో స్టెప్పులేస్తున్నారంటే ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో వాళ్లిద్దరూ కలిసి అదిరిపోయే స్టెప్పులతో ఆ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా తారక్, చరణ్ ఒకరినొకరు పట్టుకుని స్టెప్ వేసే మూమెంట్ ఈ పాటకు హైలైట్‌గా నిలిచింది. ఇద్దరి మధ్య ఆ సమన్వయం.. డ్యాన్స్‌లో సింక్ చూసి అందరూ నోరెళ్లబెట్టారు. దీన్ని లక్షల మంది అనుకరిస్తూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో వీడియోలు పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ మూమెంట్ అంత బాగా వచ్చిందంటే.. అదంతా రాజమౌళి సతాయింపు వల్లే అంటున్నాడు తారక్. ఓ ఇంటర్వ్యూలో అతనీ పాట గురించి.. షూట్‌లో రాజమౌళి తమను పెట్టిన టార్చర్ గురించి మాట్లాడాడు.

‘‘ఈ పాటలో మా ఇద్దరి పాదాలు ఎడమ, కుడి వైపుకు.. అలాగే ముందుకు వెనక్కి తిప్పే మూమెంట్ ఉంటుంది. దాని కోసం టేక్‌ల మీద టేక్‌లు తీసుకున్నాం. దాదాపు 18 టేక్స్ తర్వాత కానీ ఇది ఓకే కాలేదు. మేం ఏ చిన్న తప్పిదం చేసినా ‘సింక్’ కనిపించట్లేదు అని రాజమౌళి అనేవాడు. కాళ్లేంటి అలా కదుపుతున్నారు.. చేతులు అలాగేనా తిప్పేది.. ఇలా ఆపండి.. అలా చేయండి అంటూ ఏదో ఒకటి అంటూనే ఉండేవాడు.

ఆ చిన్న మూమెంట్ చేయడానికి ఒక రోజంతా పట్టింది. మరీ ఇంత మొండిగా ఉన్నావేంటి.. చిన్న చిన్న విషయాల గురించి ఇంత పట్టించుకుంటావేంటి.. ఎంతసేపూ సింక్ సింక్ అంటావేంటి అని జక్కన్నను అన్నాను. కానీ పాట రిలీజై ఆన్ లైన్లోకి వచ్చాక జనాల కామెంట్లు చూస్తే.. అందరూ ‘సింక్’ గురించే మాట్లాడుతున్నారు. అప్పుడు రాజమౌళికి ఫోన్ చేసి మాట్లాడా. ఇదంతా నీకు ముందే ఎలా తెలుసు అని అడిగా. రాజమౌళి ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా ఎందుకున్నాడో చెప్పడానికి ఇదే రుజువు’’ అని తారక్ అన్నాడు.