బాబాయ్ అబ్బాయ్.. క్లారిటీ ప్లీజ్

అంతా అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న రావాల్సిన సినిమా ‘విరాటపర్వం’. ముందుగా కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆ చిత్రం.. వైరస్ ప్రభావం తొలగిపోయి థియేటర్లు పున:ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా రిలీజ్ దిశగా అడుగులే వేయట్లేదు. అలాగని ఓటీటీలో అయినా సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నాలైనా జరుగుతున్నాయా అంటే అలాంటి సంకేతాలు కూడా కనిపించడం లేదు. ఈ సినిమా గురించి మీడియాలో ఏవేవో రూమర్లు వినిపిస్తున్నాయి. ఆ వార్తల లింక్స్ మీద హీరో రానా దగ్గుబాటి వ్యంగ్యంగా స్పందిస్తున్నాడు. సెటైర్లు బాగానే వేస్తున్నాడు.

అది బాగానే ఉంది కానీ.. ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మాత్రం దగ్గుబాటి హీరో ఏ సమాధానం చెప్పట్లేదు. మరీ ఇలా నెలలు నెలలు ప్రేక్షకులను వెయిట్ చేయిస్తుంటే సినిమా మీద ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ సినిమా అనే కాదు.. సురేష్ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిన వెంకటేష్ సినిమా ‘దృశ్యం-2’ విషయంలో కూడా ఏ క్లారిటీ లేదు. ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలం అయింది. ఈ రెండు చిత్రాలతో పాటుగా ‘నారప్ప’ సినిమాకు కలిపి సురేష్ బాబు ఓటీటీ డీల్స్ చేసుకున్నట్లుగా వేసవిలో వార్తలొచ్చాయి.

కానీ వీటిలో ‘నారప్ప’ ఒక్కటే జూన్‌లో అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. అప్పుడు ఓటీటీ రిలీజ్ విషయంలో వ్యతిరేకత వచ్చినా సురేష్ బాబు తగ్గలేదు. ఆ చిత్రాన్ని ప్రైమ్‌లోనే రిలీజ్ చేశారు. ఒకవేళ ‘దృశ్యం-2’, ‘విరాటపర్వం’ చిత్రాల విషయంలోనూ ఓటీటీ బాటలోనే వెళ్లాలనుకుంటే.. ‘నారప్ప’ విషయంలో మొహమాట పడని సురేష్ బాబు వీటి విషయంలో ఎందుకు తగ్గుతున్నాడో అర్థం కావడం లేదు. పోనీ ఈ చిత్రాలకు ఓటీటీ డీల్స్ క్యాన్సిల్ చేసి థియేట్రికల్ రిలీజ్‌కు వెళ్లాలనుకుంటే.. ఆ పని అయినా చేయాల్సింది. కానీ ఎటూ తేల్చకుండా నెలలకు నెలలు రిలీజ్ ఆపడం వల్ల అసలుకే మోసం వస్తోంది. ఆయనకు వడ్డీల భారం, పైగా సినిమాల మీద ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా బాబాయ్-అబ్బాయ్ సినిమాల విషయంలో ఓ క్లారిటీ వస్తే బెటర్.