అవన్నీ రూమర్సే.. ‘రాధేశ్యామ్’ మేకర్స్ క్లారిటీ!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే పనులన్నీ వేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ప్రభాస్, పూజాహెగ్డేల మధ్య విభేదాలు తలెత్తాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ కారణంగానే కొన్ని సన్నివేశాలను విడివిడిగా చిత్రీకరించారని టాక్ నడుస్తోంది. ఈ సంగతి మేకర్స్ దృష్టికి వెళ్లింది.

దీంతో తాజాగా నేషనల్ మీడియాతో మాట్లాడిన వారు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్, పూజాహెగ్డేకి మధ్య గొడవలు ఉన్నాయని వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమేనని.. ఇద్దరూ చాలా బాగున్నారని చెప్పారు. ప్రభాస్-పూజాల ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతంగా వచ్చిందని.. ఈ జంట తెరపై అందరినీ అలరించడం ఖాయమని అన్నారు. పూజాహెగ్డే షూటింగ్ కి ఆలస్యంగా వస్తుందనే విషయంపై కూడా స్పందించారు.

పూజాహెగ్డే టైమ్ సెన్స్ పాటిస్తోందని.. ఆమెతో కలిసి పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను నమ్మొద్దని తెలిపారు. 1970ల కాలంలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.