ఈ సినిమా ఆడితేనే స్టార్లు కదులుతారు

పోయినేడాది కరోనా ఫస్ట్ వేవ్ బ్రేక్ తర్వాత టాలీవుడ్ బాగానే పుంజుకుంది. రీస్టార్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’తో మంచి ఊపొచ్చింది. యావరేజ్ కంటెంట్‌తోనే ఆ సినిమా అంచనాలకు మించి ఆడేసింది. ఆ తర్వాత సంక్రాంతి సినిమాల సందడి ఎలా సాగిందో తెలిసిందే. ఐతే కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత మాత్రం పరిస్థితులు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు.

చిన్న సినిమాలైన తిమ్మరసు, ఇష్క్‌లతో ఈసారి థియేటర్లు పున:ప్రారంభం అయ్యాయి. వీటికి ఆశించినంత బజ్ కనిపించలేదు. సెకండ్ వేవ్ దెబ్బకు అల్లాడిపోయిన జనాలు థియేటర్లకు వచ్చే విషయంలో తటపటాయిస్తున్నట్లే కనిపిస్తోంది.

పైగా క్రేజీ సినిమాలు లేకపోవడం వారి వెనుకంజకు మరో కారణం కావచ్చు. ఐతే ఈ పరిస్థితుల్లోనూ ‘తిమ్మరసు’ ఓ మోస్తరుగానే ఆడుతోంది. ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. ఐతే సినీ పరిశ్రమకు అసలైన ఊపు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ఈ వారం అరడజనుకు పైగా సినిమాలు రిలీజవుతున్నాయి. ముగ్గురు మొనగాళ్లు, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, మెరిసే మెరిసే.. ఇలా కొత్త సినిమాలు చాలానే ఈ వారం థియేటర్లలోకి దిగుతున్నాయి. కానీ వాటికి ఏమంత బజ్ లేదు. ఉన్నవాటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది ‘రాజా వారు రాణి వారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరపు హీరోగా నటించిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఒక్కటే. ఈ చిత్రం టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూత్‌లో ఈ సినిమా పట్ల బాగానే ఆసక్తి కనిపిస్తోంది. దీనికి మంచి ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వస్తున్నారు.
ప్రమోషన్లు కూడా కొంచెం గట్టిగానే చేస్తున్నారు. ఈ చిత్రానికి దగ్గర మంచి ఫలితం వస్తే.. బాక్సాఫీస్ కొంచెం ఊపందుకుంటే ఆ తర్వాత స్టార్ హీరోలు నటించిన టక్ జగదీష్, లవ్ స్టోరి లాంటి మీడియం రేంజ్ చిత్రాలను రిలీజ్ చేయడానికి ధైర్యం వస్తుంది. మరి ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఎలాంటి ఫలితాన్నందుకుంటో చూడాలి.