కలల ప్రాజెక్టుపై రాజమౌళిలా చెబుతున్నాడే


తన కలల ప్రాజెక్టు మహాభారతం అని చాలా ఏళ్ల నుంచి చెబుతూ వస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. మరి ఆ సినిమా ఎఫ్పుడు అని అంటే మాత్రం.. ఆ సినిమా తీయడానికి అపార అనుభవం కావాలని, ఇంకా ఆ స్థాయి అనుభవం తనకు రాలేదని.. అది వచ్చింది అనుకున్నాక భవిష్యత్తులో ఆ చిత్రం చేస్తానని పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం ఇదే తరహాలో మాట్లాడుతున్నాడు. అ, కల్కి, జాంబిరెడ్డి లాంటి విభిన్న చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్న ప్రశాంత్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కలల ప్రాజెక్టు గురించి మాట్లాడాడు.

పదేళ్లుగా తాను తన డ్రీమ్ ప్రాజెక్టు మీద పని చేస్తున్నానని.. అదొక పౌరాణిక నేపథ్యం ఉన్న సోషియా ఫాంటసీ కథ అని చెప్పాడు ప్రశాంత్. ఐతే ఆ కథను తెరకెక్కించే అనుభవం తనకు ఇంకా రాలేదని అనుకుంటున్నానని.. తాను తీసే ఒక్కో సినిమా ద్వారా ఎంతో కొంత నేర్చుకుంటున్నానని.. వీలైనంత త్వరగా తన కలల సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తానని అన్నాడు ప్రశాంత్. ఇక ‘జాంబిరెడ్డి’ తన కొత్త సినిమా గురించి ప్రశాంత్ మాట్లాడుతూ.. ఈసారి మరో కొత్త జానర్ ప్రయత్నిస్తున్నానని.. ఆ సినిమాను ఎవరితో చేస్తానో తెలియదని.. తాను సినిమా మొదలుపెట్టాలనుకున్నపుడు ఏ హీరో అందుబాటులో ఉంటే ఆ హీరోతో సినిమా తీస్తానని చెప్పాడు ప్రశాంత్.

అ, జాంబిరెడ్డి సీక్వెల్స్ గురించి ప్రశాంత్‌ను అడిగితే.. ‘అ’ సీక్వెల్ కథ ఎప్పుడో సిద్ధమైందని, ఒక బాలీవుడ్ స్టార్‌తో ఆ సినిమా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోగా
డేట్ల సమస్య వచ్చి ఆ సినిమా ఆగిపోయిందని.. ఐతే ఓ తెలుగు హీరోతోనే కుదిరినపుడు ఈ సీక్వెల్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. ‘జాంబిరెడ్డి’ సీక్వెల్ కోసం కూడా స్క్రిప్టు రెడీ అవుతోందని ప్రశాంత్ తెలిపాడు. సమంత కోసం వేరే కథ రాశానని.. ఆమెతో చేయబోయేది ఏ సినిమాకూ సీక్వెల్ కాదని.. తమ ఇద్దరికీ కుదిరినపుడు ఆ సినిమా చేస్తానని ప్రశాంత్ వెల్లడించాడు.