అడివి శేష్‌కు హ్యాట్సాఫ్


కరోనా కష్ట కాలంలో సెలబ్రెటీలు చాలామంది తమ వంతుగా సొసైటీకి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సోనూ సూద్ లాగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి తమ వంతుగా చిన్న సాయం చేసినా చాలు. అవసరంలో ఉన్న ఒకరిద్దరికి ఆ సాయం ఉపయోగపడినా చాలు. అంతకంటే ఏం కావాలి? మన తెలుగు నటుడు అడివి శేష్ చేసిన ఒక మంచి పని ఇప్పుడు వందల మందికి ఉపయోగపడుతోంది.

ఒక ఆసుపత్రిలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించి తన పెద్ద మనసును చాటుకున్నాడు శేష్. హైదరాబాద్‌లోని కింగ్ కోఠిలో ప్రభుత్వ ఆసుపత్రికి ఘన చరిత్ర ఉంది. నగరంలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో అది ఒకటి. ఐతే అంత పెద్ద ఆసుపత్రిలో తాగు నీటి సౌకర్యం లేక సిబ్బందితో పాటు రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారని శేష్ దృష్టికి వచ్చింది.

దీంతో వెంటనే అతను తన టీంతో 850 లీటర్ల మినరల్ వాటర్ బాటిళ్లు ఒక వాహనంలో పంపించాడు. ఐతే అవి ఒకట్రెండు రోజులు మాత్రమే అక్కడి వారి దాహం తీరుస్తాయని అర్థం చేసుకున్న శేష్.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనుకున్నాడు. దీంతో సొంత ఖర్చుతో అక్కడ మినరల్ వాటర్ ఆర్వో ప్లాంట్ పెట్టించడానికి సన్నాహాలు చేశాడు. తాను అందజేసిన మినరల్ వాటర్ బాటిళ్లు అయిపోయే లోపే అక్కడ ఆర్వో ప్లాంట్ సిద్ధం అయింది.

48 గంటల వ్యవధిలో ఈ పని పూర్తి చేయించాడు. ఇప్పుడు కోఠి ఆసుపత్రిలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోయింది. ఆసుపత్రి మొత్తానికి మంచి నీళ్లు అందుతున్నాయి. ఈ పని చేసి సెలబ్రెటీలందరికీ శేష్ ఆదర్శంగా నిలిచాడు. కాస్త శ్రద్ధ పెడితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో ప్రభుత్వ అధికారులకు కూడా ఒక పాఠం నేర్పించిన శేష్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.