రజినీకి మళ్లీ ఏమైంది?

సూపర్ స్టార్ రజినీకాంత్ కొంచెం గ్యాప్ తర్వాత ఇటీవల మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీలో అన్నాత్తె కోసం భారీ సన్నివేశాల చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో రాజకీయ పార్టీ ఆలోచనను కూడా విరమించుకున్న సూపర్ స్టార్.. మధ్యలో వదిలేసిన ‘అన్నాత్తె’ చిత్రీకరణను మాత్రం కరోనా కష్ట కాలంలోనూ రిస్క్ చేసి మరీ పూర్తి చేయడానికి నడుం బిగించారు.

రామోజీ ఫిలిం సిటీలో రజినీ మీద భారీ యాక్షన్ ఘట్టాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్లో చాలామందే షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఆయన అమెరికాకు బయల్దేరుతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. దీంతో ఆయనకు మళ్లీ ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తాయా అన్న ఆందోళన అభిమానుల్లో మొదలైంది. గత ఏడాది కూడా ఆయన అమెరికాకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.

రజినీ ఆరోగ్యంగానే ఉన్నారని.. రెగ్యులర్ చెకప్‌ల కోసమే అమెరికాకు వెళ్లారని అంటున్నారు. మరి కొన్ని రోజుల తర్వాత యుఎస్‌కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు పెడతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రజినీ కొంచెం ముందుగానే యుఎస్ చేరుకుంటున్నట్లు తెలిసింది. మూణ్నాలుగు వారాల పాటు అక్కడే ఉండి పరీక్షలు చేయించుకుని.. అంతా ఓకే అనుకున్నాక ఇండియాకు వస్తారట.

తనకున్న ఆరోగ్య సమస్యలకు తోడు.. కరోనా భయం కూడా ఉండటంతో రజినీ తన వెంటే ఓ వైద్య బృందాన్ని పెట్టుకుంటున్నారు. ఆయన షూటింగ్‌కు వెళ్లినపుడు కూడా వెంట ఆ బృందం ఉంటోంది. ఈ ఏడాది దీపావళికి ‘అన్నాత్తె’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనే సంకల్పంతో రజినీ కష్టపడుతున్నారు. ఈ సినిమా పూర్తి చేశాక ఆయన పూర్తిగా విశ్రాంతికి పరిమితం కానున్నారు. కరోనా భయం పూర్తిగా తొలగిపోతే కానీ కొత్త సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదు.