ఎన్టీఆర్-త్రివిక్రమ్-మహేష్.. ఏమిటీ రచ్చ?

టాలీవుడ్లో ప్రస్తుతం ఒక రూమర్ ప్రకంపనలు రేపుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు, గందరగోళానికి దారి తీస్తోంది. ఇంతకీ ఆ రూమర్ ఏంటంటే.. జూనియర్ ఎన్టీఆర్‌తో తన తర్వాతి చిత్రాన్ని తీయాల్సిన త్రివిక్రమ్ మనసు మార్చుకున్నాడట. తారక్‌తో కాకుండా మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడట. తన మాతృ సంస్థ అనదగ్గ హారిక అండ్ హాసిని బేనర్లోనే ఈ సినిమా చేయబోతున్నాడట. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనుందట. త్వరలోనే ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టబోతున్నారట.

ఈ ప్రచారం కొంచెం గట్టిగానే నడుస్తుండటంతో ఎన్టీఆర్ అభిమానులు మంటెత్తిపోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్‌తో తారక్ జట్టు కడతాడన్నది ఈనాటి సంగతి కాదు. దాదాపు రెండేళ్ల కిందటే ఈ సినిమా ఖరారైంది. కానీ దీని గురించి ఎప్పటికప్పుడు సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

ఐతే ఉగాదికి తారక్-త్రివిక్రమ్ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం ఖాయమని ఇటీవలే సంకేతాలు అందాయి. ఏప్రిల్ చివరి వారంలో, లేదా మే మొదటి వారంలో చిత్రీకరణ కూడా మొదలవుతుందని ఇటీవల నిర్మాత నాగ వంశీ సైతం స్పష్టత ఇచ్చాడు అయినా సరే.. ఇప్పుడు బయటికి వచ్చిన సమాచారంపై జోరుగా ప్రచారం సాగుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు.

స్క్రిప్టు విషయంలో ఏకాభిప్రాయం కుదరక ఈ సినిమాను హోల్డ్‌లో పెట్టారని.. ఈ లోపు మహేష్‌తో త్రివిక్రమ్ సినిమా ఓకే చేయించుకున్నాడని.. ‘సర్కారు వారి పాట’ను పూర్తి చేశాక, రాజమౌళి సినిమా మొదలుపెట్టడానికి మధ్య దొరికే గ్యాప్‌లో త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి మహేష్ రెడీ అయిపోయాడని జోరుగా వార్తలొస్తున్నాయి. కొందరు పీఆర్వోలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తుండటంతో ఇది ఉత్తుత్తి ప్రచారమేమీ కాదని అంటున్నారు. ఇదే జరిగితే తారక్ ఫ్యాన్స్ మామూలుగా హర్టవ్వరు. ఇంతకుముందు ‘కేజీఎఫ్’ తర్వాత తారక్‌తో సినిమా చేయాల్సిన ప్రశాంత్ నీల్.. అతడి సినిమాను పక్కన పెట్టి ప్రభాస్‌తో ‘సలార్’ను లైన్లో పెట్టాడు. ఇప్పుడేమో త్రివిక్రమ్ కూడా ఇలాగే హ్యాండిచ్చి మహేష్ బాబుతో జట్టు కడితే తారక్ అభిమానుల ఆగ్రహం మామూలుగా ఉండదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.