‘ఉప్పెన’ను ఆపి మంచి పని చేశారే..

గత ఏడాది కరోనా కారణంగా లాక్ డౌన్ అమలు కావడానికి ముందు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల్లో ‘ఉప్పెన’ ఒకటి. థియేటర్లు ఎంతకీ తెరుచుకోక పోయేసరికి కొందరు నిర్మాతలు వేచి చూడలేక కొన్ని సినిమాలను మంచి డీల్స్‌కు టెంప్ట్ అయి ఓటీటీలకు ఇచ్చేశారు కానీ.. ‘ఉప్పెన’ టీం మాత్రం తొణకలేదు.

మెగా ఫ్యామిలీ నుంచి ఓ కొత్త హీరో తెలుగు సినిమాలోకి అడుగు పెడుతున్నపుడు అతడి అరంగేట్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీలో చేయిస్తే బాగుండదని పట్టుబట్టి ఈ సినిమాను ఆపినట్లున్నారు. ఇలా మూణ్నెల్లు కాదు.. ఆర్నెల్లు కాదు.. పది నెలలకు పైగా ఓపిక పట్టారు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు. థియేటర్లు తెరుచుకున్నాక కూడా మంచి టైమింగ్ చూసి సినిమాను విడుదల చేయాలని ఆగారు. చివరికి ఈ ప్రేమకథకు వేలంటైన్స్ డే వీకెండ్ సరైందని భావించి ఫిబ్రవరి 12న విడుదలకు ముహూర్తం చూశారు.

‘ఉప్పెన’ను ఓటీటీలకు ఇవ్వకుండా.. థియేటర్లు తెరుచుకున్నాక హడావుడిగా రిలీజ్ చేయకుండా నిర్మాతలు మంచి పనే చేశారనిపిస్తోంది ఇప్పుడు చూస్తుంటే. ఈ మధ్య రిలీజ్ చేసిన టీజర్, ఆ తర్వాత వచ్చిన జలజల జలపాతం పాటలు సినిమాపై అంచనాల్ని ఇంకా పెంచాయి. ఒక ఎపిక్ లవ్ స్టోరీ చూడబోతున్నామనే ఫీలింగ్ కలుగుతోంది ప్రేక్షకులకు. సంక్రాంతి సినిమాలు ఇచ్చిన ఉత్సాహంతో ఈ సినిమాకు మంచి బిజినెస్ కూడా అయినట్లు తెలుస్తోంది.

థియేటర్లు తెరుచుకున్నాక హడావుడిగా సినిమాను రిలీజ్ చేసినా, సంక్రాంతి రేసులో నిలిపినా కిల్ అయిపోయేదేమో. ఇప్పుడు మంచి హైప్ మధ్య బాక్సాఫీస్‌ను రూల్ చేయడానికి సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో కూడా మంచి రిపోర్ట్స్ ఉన్నాయి. 12న సినిమా రిలీజయ్యే సమయానికి ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల ఫోకస్ పూర్తిగా ‘ఉప్పెన’ మీదే ఉండనుంది. సినిమా ఆలస్యమైతే అయింది కానీ.. మంచి టైమింగ్‌లోనే రిలీజవుతోందని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.