ఒక్క డైలాగూ లేని ట్రైలర్

సంక్రాంతికి సినిమాను అనౌన్స్ చేసి.. మూడు వారాలు తిరక్కుండానే ట్రైలర్ రిలీజ్ చేసి పెద్ద షాకే ఇచ్చింది ‘పవర్ ప్లే’ టీమ్. రాజ్ తరుణ్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’; ఒక లైలా కోసం’, ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాల దర్శకుడు విజయ్ కుమార్ రూపొందించిన థ్రిల్లర్ మూవీ. ఫస్ట్ లుక్‌ చూసినప్పుడే ఇది సీరియస్ థ్రిల్లర్‌ మూవీ అనే విషయం అర్థమైంది. ఇప్పుడు ట్రైలర్ కూడా సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్లే సాగింది. ఒకటిన్నర నిమిషం ఉన్న ట్రైలర్లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం గమనార్హం.

డైలాగ్స్ లేకపోవడం వల్ల కథేంటన్నది అర్థం కాలేదు కానీ.. ఇది వయొలెన్స్‌తో ముడిపడ్డ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనేది మాత్రం అర్థమవుతోంది. ట్రైలర్ ఆరంభం నుంచి చివరి వరకు ఉత్కంఠభరితంగానే సాగింది. ట్రైలర్ అంతా కూడా హీరో ఉరుకులు పరుగుల మీదే కనిపించాడు.

ట్రైలర్ ఆరంభంలోనే ఒక హత్యకు సంబంధించి క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్న షాట్ పడింది. ఆ తర్వాత ఓ రాజకీయ పార్టీ పోస్టర్, ఏటీఎం, డబ్బులు, పబ్, పోలీసు వాహనాలకు సంబంధించిన షాట్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. ఇది ఒక క్రైమ్ చుట్టూ నడిచే కథ అన్న క్లారిటీ చాలా త్వరగానే వచ్చేస్తుంది.

రాజ్ తరుణ్ కొంచెం భిన్నమైన లుక్‌లో కనిపించాడు. హేమల్ అనే కొత్తమ్మాయి అతడికి జోడీగా నటించింది. తనతో ఒక హాట్ లిప్ లాక్ కూడా చేశాడు రాజ్. హీరోయిన్ని మించి ఇందులో పూర్ణది కీలక పాత్రలా కనిపిస్తోంది. ట్రైలర్లో ఆమె బాగానే హైలైట్ అయింది. కోట శ్రీనివాసరావు పొలిటీషియన్‌గా, మధునందన్ పోలీసుగా దర్శనమిచ్చారు. అజయ్ కీలక పాత్రే చేసినట్లు కనిపిస్తున్నాడు. నంద్యాల రవి ఈ చిత్రానికి కథ అందించగా.. మహిధర్, దేవేష్ అనే కొత్త నిర్మాతలు ప్రొడ్యూస్ చేశారు. త్వరలోనే ‘పవర్ ప్లే’ రిలీజ్ అంటున్నారు కానీ.. థియేటర్లలోనా, ఓటీటీలోనా అన్నదే చెప్పట్లేదు. ఏదో ఒక ఓటీటీలోనే సినిమా రిలీజవుతుందని తెలుస్తోంది.