రాజ‌మౌళిపై బోనీ క‌పూర్ ఇంకాస్త ఘాటుగా..


మ‌న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళికి శ్రీదేవి కుటుంబంతో చిన్న వివాదం ఉన్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి సినిమాలో శివ‌గామి పాత్ర కోసం శ్రీదేవిని అడిగితే ఆమె అల‌విమాలిన డిమాండ్లు చేశార‌ని.. ఒక హోట‌ల్ ఫ్లోర్ మొత్తం త‌మ కోసం బుక్ చేయాల‌ని, త‌న‌తో పాటు వ‌చ్చే టీంకు బిజినెస్ క్లాస్ టికెట్లు ఇవ్వాల‌ని, అలాగే భారీ పారితోష‌కం కూడా డిమాండ్ చేశార‌ని ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి చెప్ప‌డం అప్ప‌ట్లో దుమారం రేపింది. దీనిపై ఆ త‌ర్వాత శ్రీదేవి స్పందించ‌డం, రాజ‌మౌళి వ్యాఖ్య‌ల్ని ఖండిస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం తెలిసిన సంగ‌తే. ఈ వివాదాన్ని అంత‌టితో ముగిద్దాం అంటూ తదుప‌రి ఏ వ్యాఖ్య‌లూ చేయ‌లేదు రాజ‌మౌళి. అంత‌టితో ఆ క‌థ ముగిసింది.

కానీ ఇప్పుడు రాజ‌మౌళికి.. శ్రీదేవి భ‌ర్త బోనీ క‌పూర్‌తో అనుకోని వివాదం త‌లెత్తింది. ఆయ‌న నిర్మాణంలో తెర‌కెక్కుతున్న మైదాన్ సినిమాను ఆల్రెడీ ద‌స‌రా రోజు రిలీజ్ చేయ‌డానికి నిర్ణ‌యించ‌గా.. రెండు రోజుల ముందు ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌కు డేట్ ఫిక్స్ చేసుకుంది జ‌క్క‌న్న టీం. దీనిపై ఇప్ప‌టికే బోనీ విమ‌ర్శ‌లు చేశారు. రాజ‌మౌళికి నైతిక‌త లేద‌ని పెద్ద కామెంట్ చేశారు కూడా.

అంత‌టితో ఆగ‌కుండా త‌న భార్యతో రాజ‌మౌళికి ఉన్న పాత వివాదాన్ని బ‌య‌టికి తీశారు బోనీ. శ్రీదేవి అన్ ప్రొఫెష‌న‌ల్ అంటూ అప్ప‌ట్లో రాజ‌మౌళి వ్యాఖ్యానించాడ‌ని.. కానీ నిజానికి రాజ‌మౌళే అన్ ప్రొఫెష‌న‌ల్ అని ఆయ‌న తాజాగా ఓ మీడియా సంస్థ‌తో వ్యాఖ్యానించారు.

అప్ప‌టి వివాదంపై ఆయ‌న స్పందిస్తూ.. రాజ‌మౌళి ముంబయికి వచ్చి శ్రీదేవికి కథ చెప్పారని, కానీ ఆమె అంత ఆసక్తి చూపలేదని, ఐతే త‌నే ‘మగధీర’, ‘ఈగ’ చిత్రాలను చూపించి.. రాజమౌళి లాంటి అగ్ర ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌మ‌ని సిఫార‌సు చేశాన‌ని బోనీ వెల్ల‌డించాడు. దీంతో సినిమా చేయ‌డానికి సుముఖ‌త వ్య‌క్తం చేసిన శ్రీదేవి.. తొలి న‌రేష‌న్ త‌ర్వాత కొన్ని ఇన్‌పుట్స్ కూడా ఇచ్చార‌ని.. అవి రాజ‌మౌళికి కూడా న‌చ్చాయ‌ని, త‌న అభిమానిగా ఆమెపై ఇంకా గౌర‌వం పెరిగింద‌ని చెప్పాడ‌ని.. అందుకే శ్రీదేవి ఆ సినిమా చేయ‌లేద‌ని బోనీ అన్నారు. అప్పుడు ఆ విష‌యం గురించి తాము ఏమీ మాట్లాడ‌లేద‌ని.. కానీ ఇప్పుడు ఆలోచిస్తే రాజమౌళి టోటల్లీ అన్‌ప్రొఫెషనల్‌ అని.. సీనియర్ల పట్ల గౌరవం లేదని అనిపిస్తోందని బోనీ వ్యాఖ్యానించాడు.