‘అరుంధతి’ తర్వాత ఇన్నేళ్లకు..

టాలీవుడ్లో గొప్ప చరిత్ర ఉన్న బేనర్లలో ఎం.ఎస్.ఆర్ట్స్ మూవీస్ ఒకటి. ఈ బేనర్ మీద శ్యాం ప్రసాద్ రెడ్డి అంకుశం, అమ్మోరు, అరుంధతి లాంటి ఎపిక్ మూవీస్ తీశారు. ‘అంజి’ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా అది కూడా ఒక ఎపిక్ మూవీనే. తీసింది తక్కువ సినిమాలే అయినా.. శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఒక లెజెండ్ లాగే చూస్తుంది సినీ పరిశ్రమ.

తనతో ‘విక్రమార్కుడు’ సినిమా చేస్తున్నపుడు అనుష్క ‘అరుంధతి’ ఆఫర్ గురించి రాజమౌళికి చెబితే.. ఆ సినిమా కథ గురించి కూడా పట్టించుకోవద్దు సినిమా చేసేయ్ అన్నారట. శ్యామ్ ప్రసాద్ రెడ్డి సినిమా అంటే ఎంతో నేర్చుకోవచ్చన్న ఉద్దేశంతోనే జక్కన్న అలా అన్నట్లు అనుష్క ఓ సందర్భంలో చెప్పింది. సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ అలాంటిది. ఈ ప్యాషన్‌తోనే ఆయన అమ్మోరు, అంజి, అరుంధతి లాంటి సాహసోపేత సినిమాలు తీయగలిగారు.

ఐతే చివరగా ‘అరుంధతి’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన శ్యామ్.. ఆ తర్వాత సినిమాలే నిర్మించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ చిత్రం కోసం ఆయన పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదు. రిలీజ్ సమయంలోనూ ఎన్నో అడ్డంకులను దాటి ఆ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అది అద్భుత ఫలితాన్నందుకుంది. కానీ ఆయన అనూహ్యంగా సినిమాల నిర్మాణం ఆపేశారు. ఆయన ఫోకస్ బుల్లితెర మీదికి వెళ్లిపోయింది. ‘జబర్దస్త్’ సహా కొన్ని షోలు చేశారు. ఇక సినిమాల నిర్మాణమే పట్టనట్లుగా సాగిపోయిన ఆయన.. మళ్లీ చాలా ఏళ్ల విరామం తర్వాత ప్రొడక్షన్లోకి వస్తున్నారు. తన నిర్మాణంలో అందరూ కొత్త వాళ్లతో ఓ సినిమా చేయడానికి ఆయన సిద్ధమయ్యారు.

మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ తరఫున ఈ సినిమాకు కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చారు. ఆడిషన్స్ ప్రక్రియ నడుస్తోంది. పెద్ద దర్శకులు, నటీనటులతో భారీ చిత్రాలు తీసిన శ్యామ్.. ఈసారి కొత్త వాళ్లతో చిన్న సినిమాకు రెడీ అవుతుండటం విశేషమే. మరి ఈసారి ఆయనెలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.