వెనక్కి తగ్గేదే లేదన్న ఎన్టీఆర్ ఫ్యాన్

‘రా ఎన్టీఆర్’ పేరుతో ఒక ఎన్జీవో చేపట్టబోతున్న ‘ఊరు వాడ’ కార్యక్రమం మీద ఇటీవల పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చే ప్రణాళికతోనే తారక్ తన అభిమానులతో ఈ కార్యక్రమం చేయిస్తున్నట్లుగా ఓ ప్రచారం జరగడం.. ఇంతలో ఈ కార్యక్రమానికి, తారక్‌కు సంబంధం లేదని ఆయన ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రావడం చర్చనీయాంశం అయింది.

కానీ ‘రా ఎన్టీఆర్’ సంస్థను నడిపించే అభిమాని మాత్రం ‘ఊరు వాడ’ కార్యక్రమం విషయంలో వెనుకంజ వేయబోమని.. ఎన్టీఆర్ ఆఫీస్ పేరుతో వచ్చిన ప్రెస్ నోట్‌లో అసలు తారక్ ప్రమేయం ఉందా అని మీడియాతో వ్యాఖ్యానించడంతో పీటముడి బిగుసుకుంది. ఇప్పటిదాకా టీవీ ఛానెళ్ల ద్వారా మెసేజ్ ఇస్తూ వచ్చిన ఆ అభిమాని.. ఇప్పుడు కో ఫ్యాన్స్‌తో కలిసి హైదరాబాద్‌లో పెద్ద ప్రెస్ మీటే పెట్టాడు. ‘ఊరు వాడ’ కార్యక్రమం కచ్చితంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా అతను స్పష్టం చేశాడు.

ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్‌ విషయంలో మరోసారి సందేహాలు వ్యక్తం చేసిన ఆ ఫ్యాన్.. ఏం జరిగినా ‘ఊరు వాడ’ కార్యక్రమం విషయంలో వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేశాడు. ఐతే గత వారం రోజులుగా జరిగిన పరిణామాలతో తాను విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నానని.. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడినపుడు కొన్ని పదాలు తప్పుగా దొర్లి ఉండొచ్చని.. అందుకు తారక్‌తో పాటు అభిమానులకూ క్షమాపణ చెబుతున్నానని అతనన్నాడు. మీడియాకు కూడా అతను సారీ చెప్పాడు. ఇలా క్షమాపణ చెబుతూనే.. తమ సేవా కార్యక్రమాల విషయంలో మాత్రం తగ్గబోమని.. తారక్‌కు మంచి పేరు తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అతను స్పష్టం చేశాడు. 

తమ సంస్థకు గుర్తింపు లేదని.. దీంతో ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు సంబంధం లేదని రిజిస్టర్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆ అభిమాని స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా తారక్‌కు కొన్ని కోట్లమంది అభిమానులు ఉన్నారని.. వాళ్లందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడం సాధ్యం కాదని.. అలా చేయాలంటే సర్వర్లు పని చేయవని అతనన్నాడు. తమది ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎన్జీవో అని.. ఈ సంస్థలో కార్యక్రమాలు కొనసాగుతాయని ఆ అభిమాని స్పష్టం చేశాడు.