ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెల‌వ‌డం తెలిసిందే. ఇక‌, తాజాగా జూలై 18 నుంచి ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నార‌ని.. ఊరూ-వాడా వంటి కార్య‌క్ర‌మాల‌తో రాజ‌కీయ వేదిక‌కు శ్రీకారం చుట్ట‌నున్నార‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. దీనిని జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం తాజాగా ఖండించింది. ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావ‌డం లేద‌ని పేర్కొంది.

ఊరూ-వాడా పేరుతో నిర్వ‌హించే కార్య‌క్ర‌మాన్ని ఎప్పుడో షెడ్యూల్ చేశామ‌ని.. దీనికి రాజ‌కీయాల‌కు సంబంధం లేద‌ని తెలిపింది. క‌ట్ చేస్తే.. అస‌లు తార‌క్‌.. రాజ‌కీయాల్లోకి రావాల‌ని అనుకున్నా.. ఇప్పుడున్న వాతావ‌ర‌ణంలో ఏమేర‌కు ఇమ‌డ‌గ‌లుగుతార‌న్న‌ది ప్ర‌శ్న‌. దీనిపైనే ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. ఒక‌ప్పుడు పెద్ద ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావ‌డం వేరు. అప్ప‌ట్లో అంటే.. రాజ‌కీయాల్లో వ్య‌క్తిత్వ హ‌న‌నాలు ఉండేవి కాదు. పైగా పార్టీలు వేరైనా ఒక‌రినొక‌రు గౌర‌వించుకునే సంస్కృతి  ఉండేది.

నంద్యాల పార్ల‌మెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పీవీ న‌ర‌సింహారావు పోటీకి నిల‌బ‌డ‌తార‌ని ప్ర‌క‌ట‌న రాగానే.. ఎన్టీఆర్ స్పందించి.. ఆయ‌న‌పై మేం పోటీకి దిగం… మ‌న తెలుగు వారు ప్ర‌ధాని అవుతుంటే ఆహ్వానిస్తాం.. అని ప్ర‌క‌టించిన సంప్ర‌దాయ రాజ‌కీయాలు నేడు ఎక్క‌డున్నాయి?!. పైగా గ‌త ప‌దేళ్ల రాజ‌కీయ‌ల‌ను తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భ్ర‌ష్టుప‌ట్టాయ‌న్న వాద‌న‌ను కొట్టివేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. దుర్భాష‌లు, బూతులకు నేడు రాజ‌కీయాలు ఆల‌వాలంగా మారాయి.

ఇలాంటి వాటిని ఎన్టీఆర్‌ త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌రా? అనేది ప్ర‌శ్న‌. అత్యంత సెన్సిటివ్ గా ఉండే తార‌క్‌.. ఆత్మ‌గౌర‌వానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ, రాజ‌కీయాలు అలా లేవు. చంద్ర‌బాబు వంటి బ‌ల‌మైన నాయ‌కుడు కూడా క‌న్నీరు పెట్టుకునే ప‌రిస్థితిని మ‌నం చూశాం. ఇక‌, ఈ ప‌రంప‌ర ఇంకా కొన‌సాగుతూనే ఉంది. దీనిని ఛేధించి.. రాజ‌కీయాల్లో నిల‌బ‌డ‌డం.. అంటే తార‌క్ వంటి సునిశిత స్వ‌భావం ఉన్న వారికి సాధ్యం కాక‌పోవ‌చ్చు. ఇక‌, ఓటు బ్యాంకు ప‌రంగా కూడా.. కులాలు, మ‌తాల ప్రాతిప‌దిక‌న చీలిపోయి క‌నిపిస్తోంది. దీనిని ఏకం చేయడం.. త‌ట‌స్థుల‌ను ఆక‌ర్షించడం.. వంటివి కూడా తార‌క్‌కు పెను స‌వాలుగా మారే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.