నిర్మాత కావాలనే తమిళులను కెలికారా?

జూనియ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేష‌న్లో సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి జీవిత క‌థ ఆధారంగా రాబోతున్న మెగా మూవీ గురించి ఇటీవ‌లే అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్ట‌ర్, దాన్ని షేర్ చేస్తూ నిర్మాత నాగ‌వంశీ పెట్టిన పోస్టు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అవి త‌మిళ జ‌నాల‌కు ఏమాత్రం రుచించ‌లేదు. పోస్ట‌ర్లో త‌మిళం కాకుండా హిందీ లిపి ఉండ‌డం.. అలాగే సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ఉత్త‌రాదిన జ‌న్మించాడంటూ నాగ‌వంశీ పోస్టులో పేర్కొన‌డం మీద వాళ్లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

నాగ‌వంశీకి, ఈ చిత్ర బృందానికి చ‌రిత్ర తెలియ‌దని.. త‌మిళ‌నాట కొలువైన సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామిని ఉత్త‌రాదిన పుట్టినట్లు ఎలా చెబుతార‌ని వాళ్లు మండిప‌డుతున్నారు. ఐతే త‌మిళులు మురుగుడిని ఎంత ప్ర‌త్యేకంగా భావిస్తారో.. త‌మ భాష, సంస్కృతి, దేవుళ్ల విష‌యాల్లో వాళ్లెలా స్పందిస్తార‌.. వాళ్ల ప్రాంతీయ అభిమానం ఎలాంటిదో తెలిసి కూడా నాగ‌వంశీ ఇలా ఎందుకు పోస్టు పెట్టాడ‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

ఐతే సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి.. శివ పార్వ‌తుల త‌న‌యుడు కాబ‌ట్టి ఉత్త‌రాదిన పుట్టాడని.. త‌ర్వాత ద‌క్షిణాదిన, త‌మిళ‌నాడులో కొలువ‌య్యాడంటే.. ఆ స్టేట్మెంట్లో త‌ప్పేముంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఐతే నిజ‌మే అయినా స‌రే త‌మిళుల సంగ‌తి తెలిసి కూడా నాగ‌వంశీ ఇలా పోస్టు పెట్ట‌డంలో ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ కూడా ఉండొచ్చ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. త‌మిళ ప్రేక్ష‌కులు ఇత‌ర భాష‌ల సినిమాల‌ను ప‌ట్టించుకోర‌న్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి, కేజీఎఫ్, పుష్ప‌, ఆర్ఆర్ఆర్ లాంటి కొన్ని సినిమాలు మాత్ర‌మే ఇందుకు మిన‌హాయింపు.

రేప్పొద్దున‌ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి మీద సినిమా తీసినా.. దాన్ని చూస్తార‌నే గ్యారెంటీ లేదు. పైగా త‌మ దేవుడి మీద సినిమా స‌రిగా తీయ‌లేద‌ని లోపాలు వెతికే అవ‌కాశాలే ఎక్కువ‌. కానీ ఈ సినిమా ఉత్త‌రాది జ‌నాల‌కు క‌నెక్ట్ అయితే మాత్రం వ‌సూళ్ల వ‌ర్షం కురుస్తుంది. చిన్న‌దైన త‌మిళ మార్కెట్ మీద చిత్ర బృందానికి పెద్ద‌గా ఆశ‌లు లేక‌పోవ‌చ్చు. అందుకే నార్త్ వాళ్ల‌కు సినిమాను క‌నెక్ట్ చేయ‌డంపై నాగ‌వంశీ దృష్టిపెట్టాడా.. త‌మిళుల‌ను క‌వ్వించి కాంట్ర‌వర్శీ క్రియేట్ చేయ‌డం ద్వారా సినిమాకు కావాల్సిన ప‌బ్లిసిటీ సంపాదించ‌డంతో పాటు ఉత్త‌రాది వాళ్ల‌కు సినిమాను చేరువ చేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది.