మళ్లీ తమిళ దర్శకుడితో తెలుగు హీరో?

తెలుగులో కేవలం నటనకు పరిమితం కాకుండా.. రైటింగ్, మేకింగ్‌లోనూ భాగం అవుతూ తన సినిమాలను సక్సెస్ చేసుకునే హీరోల్లో నవీన్ పొలిశెట్టి ఒకడు. తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మొదలుకుని.. ప్రతి సినిమాలోనూ తన కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ముఖ్యంగా తన చివరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విషయంలో అతనెంత ఇన్వాల్వ్ అయ్యాడో తెలిసిందే.

ఈ సినిమాను డైరెక్ట్ చేసిన మారి గురించి ఎవ్వరూ మాట్లాడుకోలేదు. ఆ తమిళ కుర్రాడు పేరుకే దీనికి దర్శకుడిగా ఉన్నాడు.. అన్నీ చూసుకుంది నవీనే అని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లే సక్సెస్ క్రెడిట్ అంతా నవీన్ ఖాతాలోకే వెళ్లింది. కట్ చేస్తే ఇప్పుడు మరో తమిళ దర్శకుడితో నవీన్ జట్టు కట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడి పేరు.. ఆంటోనీ భాగ్యరాజ్.

తమిళంలో జయం రవి హీరోగా ‘సైరెన్’ చిత్రంతో ఆంటోనీ దర్శకుడిగా మారాడు. ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు కానీ.. దర్శకుడిగా ఆంటోనీని కొంత పేరొచ్చింది. ఇంకా ఈ దర్శకుడు తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించలేదు. ఐతే అతను నవీన్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. నవీన్‌తో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా తీసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయనుందట.

ఆ సంస్థ అధినేతలతో నవీన్‌కు మంచి అనుబంధం ఉంది. ఇటీవల నవీన్ పంచుకున్న ఒక సరదా వీడియోలో మైత్రీ అధినేతలు కనిపించారు. ఆ వీడియో పంచుకుంటూ తన తర్వాతి సినిమా గురించి త్వరలోనే అప్‌డేట్ ఇస్తానని ప్రకటించాడు నవీన్. ఆ ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఆటోమేటిగ్గా ఈ సినిమా స్క్రిప్టులోనూ నవీన్ ఇన్వాల్వ్ అవుతాడనడంలో సందేహం లేదు. ‘అనగనగా ఒక రాజు’కు నవీన్‌తో కలిసి స్క్రిప్టు రాసిన చిన్మయి ఘాట్రాజు కూడా ఇందులో భాగం కావచ్చు.